Andhra News: మోటార్లకు మీటర్లు బిగిస్తాం.. రాయితీ మొత్తం రైతు ఖాతాలో వేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి

Published : 29 Sep 2022 16:35 IST

అమరావతి: వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 41వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో 77వేల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యుత్‌ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డీబీటీ కోసం ఖాతాలు తెరిచారన్నారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని తెలిపారు. 

స్మార్ట్‌ మీటర్ల వల్ల 30శాతం మేర సబ్సిడీ చెల్లింపుల్లో ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితం అయ్యిందన్నారు. స్మార్ట్‌ మీటర్లపై మాట్లాడే విపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలని సూచించారు. చంద్రబాబుకు వంతపాడుతున్న జనసేన, కమ్యూనిస్టు నేతలే అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని