Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. 316మంది ఏపీ వాసులు సేఫ్‌, 141మంది ఫోన్లు స్విచ్ఛాఫ్

ఒడిశాలో ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణించిన 316 మంది ఏపీ వాసులు సురక్షితంగా బయటపడినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 03 Jun 2023 19:28 IST

విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా, 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ఎంతమంది ఉన్నారనే దానిపై రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన అధికారులు.. రైల్వేశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించారు. రెండు రైళ్లలో ప్రయాణించిన ఏపీకి చెందిన వారి యోగక్షేమాలపై రైల్వే శాఖప్రకటన విడుదల చేసింది. ఎంత మంది రిజర్వేషన్‌ చేసుకున్నారు? వారిలో ఎంత మంది రైల్లో ప్రయాణించారు?ఎంత మంది ఆచూకీ తెలియడం లేదనే దానిపై స్పష్టత ఇచ్చింది. 

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో..

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం సంభించినప్పుడు అందులో ప్రయాణిస్తున్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణిస్తున్న వారి వివరాలు వెల్లడించారు. రైల్లో ప్రయాణించిన వారిలో విశాఖపట్నానికి చెందిన 165 మంది, రాజమహేంద్రవరం నుంచి 22 మంది, విజయవాడకు చెందిన 80 మంది ..మొత్తం 267 మంది  సురక్షితంగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు. పాక్షికంగా గాయపడిన వారిలో విశాఖ నుంచి 11, ఏలూరుకు చెందిన ఇద్దరు, విజయవాడకు చెందిన ఇద్దరు.. మొత్తం 20మంది ఉన్నారు. ఈమేరకు ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉన్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. రిజర్వేషన్‌ ఉన్నా ఈ రైల్లో ప్రయాణం చేయని వారి జాబితాలో విశాఖ నుంచి 57 మంది, ఏలూరు నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 22 మంది ..మొత్తం 82 మంది ఉన్నారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ లేదా సమాధానం ఇవ్వని ప్రయాణికుల సంఖ్య 113గా తేల్చారు. ఇందులో విశాఖ నుంచి 76 మంది , రాజమహేంద్రవరం నుంచి 9, విజయవాడ నుంచి 28 మంది ఫోన్‌లు స్విచ్చాఫ్ అయ్యాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో..

యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  49 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో విశాఖ నుంచి 17 మంది, రాజమహేంద్రవరం నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 21 మంది, బాపట్ల నుంచి 8మంది మొత్తం 49 మంది క్షేమంగా ఉన్నారు.  ఇదే రైలులో ప్రయాణిస్తూ పాక్షికంగా గాయపడిన వారు విశాఖ నుంచి ఇద్దరు ఉన్నట్టు గుర్తించారు. రిజర్వేషన్‌ ఉన్నా ఈ రైల్లో ప్రయాణించని వారు విశాఖ నుంచి ఐదుగురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి నలుగురు మొత్తం 10మందిగా గుర్తించారు. ఇదే రైల్లో రిజర్వేషన్‌ చేసుకున్న వారిలో ఫోన్‌ స్విచాఫ్‌ లేదా ఫోన్‌ చేసినా స్పందించని వారు విశాఖ నుంచి 9, విజయవాడ నుంచి 16, నెల్లూరు నుంచి ముగ్గురు.. మొత్తం  28 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియలేదని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రైల్వేశాఖకు తెలిపాయి. వీరికి ఎలాంటి ప్రమాదం జరిగింది? వీరి ఆచూకీ ఎందుకు తెలియడం లేదు?వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నారా? ఎందుకు ఫోన్లు స్విచ్చాఫ్‌ అయ్యాయో తెలుసుకునేందుకు ఘటనా స్థలికి ప్రత్యేక బృందాలు కూడా వెళ్లాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆచూకీ తెలియని వారి ఫోన్లు ఏ లొకేషన్‌లో స్విచ్చాఫ్ అయ్యోయో విశ్లేషించేందుకు డేటా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని