బొక్కేస్తున్నారు.. చెక్కేస్తున్నారు..!
భారత్లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. లలిత్ మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో
భారత్లో బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోతున్న ఆర్థిక నేరస్థులు
లొసుగులతో సొమ్ము చేసుకుంటున్న బడా వ్యాపారవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. లలిత్ మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఎందుకు ముందుకు సాగడం లేదు? వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ప్రజాధనాన్ని ఆర్థిక నేరస్థుల బారి నుంచి కాపాడలేకపోవడం సర్కారు చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ నేరగాళ్లను వెనక్కి తీసుకురాలేకపోవడానికి కారణాలు ఏమిటి?
ఎందుకు తీసుకురాలేకపోతున్నారు..?
భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారంతా ఇక్కడ శిక్ష నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోతున్నారు. ఎంతో కొంత పెట్టుబడులు పెడితే చాలు పౌరసత్వం ఇచ్చే దేశాలనే వారు ఎంచుకుంటున్నారు. ఇలా అక్కడికి వెళ్ళిన వారిని వెనక్కు తీసుకురావాలంటే అనేక చట్టాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు వారిని వెనక్కు రప్పించడంలో ప్రభావం చూపుతున్నాయి. వారిని అప్పగించేందుకు అక్కడి కోర్టులు కూడా అంగీకారం తెలపాల్పి ఉంటుంది. 2002 నుంచి ఇప్పటిదాకా చట్టప్రకారం నేరస్థుల అప్పగింత చట్టం ద్వారా 72 మందిని వెనక్కు తెచ్చుకోగలిగాం. ఇంకా 315 కేసుల వరకు అనిశ్చితిలో ఉన్నాయి. ఇలాంటి చట్టపరమైన అడ్డంకులను దాటుకుని వెనక్కు తీసుకురావడం చాలా కష్టమైన ప్రక్రియ కావడంతో వారంతా అక్కడికి పారిపోతున్నారు. మెహుల్ ఛోక్సీ తాజా ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. వారిని స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైంది కావడంతో అప్పటిదాకా హాయిగా కాలం గడపొచ్చనే ఉద్దేశంతో వారంతా అక్కడికి వెళ్తున్నారు.
లొసుగులే వరాలయ్యాయి..
ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన వారంతా బ్యాంకు గ్యారంటీ అనే లొసుగులను ఉపయోగించుకునే చాలాకాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నేళ్ల తర్వాతనే పట్టుబడుతున్నారు. మెహుల్ ఛోక్సీ వ్యవహారం చూస్తే.. నేరం బయటపడ్డ నెల రోజుల తర్వాతనే విదేశాలకు పారిపోయాడు. బ్యాంకులో వివిధ స్థాయుల్లో ఆడిట్ ప్రక్రియ జరుగుతుంది. అవన్నీ దాటుకుని నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తి రూ.14 వేల వేల కోట్ల రూపాయలు ఎలా తీసుకున్నాడనే అంశంపై ఇంతవరకు సమాధానం లేదు. అంటే వ్యవస్థలో లోపం కన్నా.. ఆ వ్యవస్థను అమలు పరిచేవారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ మాల్యా సైతం తన వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకొని మరీ రెండు మూడు నెలల తరువాత వెళ్ళిపోయాడు. అతడిపై సీబీఐ లుకవుట్ నోటీసులు జారీ చేసినప్పటికీ తన రాజకీయ పలుకుబడితో వారం రోజుల్లో దాన్ని విరమింపచేసుకున్నాడు. ఆ తర్వాత వారం రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి పాస్పోర్టును సైతం సీజ్ చేసే అధికారం తనకు లేదని భారత ప్రభుత్వం వెల్లడించడం హాస్యాస్పదం. భారీగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ పేర్లను సైతం భారత ప్రభుత్వం, బ్యాంకులు బహిరంగంగా ప్రకటించడం లేదు. రూ.500 కోట్లకు పైబడిన రుణాలు తీసుకున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. కోడ్ ఆఫ్ సీక్రెసీ ప్రకారం వారి పేర్లు బయట పెట్టడం కుదరదంటూ రిజర్వుబ్యాంకు చెప్పడం గమనార్హం. కానీ చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న పేద, మధ్యతరగతి వర్గాల పేర్లను మాత్రం బహిరంగంగా పత్రికల్లో ప్రచురిస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. అప్పు ఎగ్గొట్టిన బడా బాబుల కేసులన్నింటినీ సివిల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా విచారిస్తున్నారు. ఇలాంటి వారిలో కనీసం ఇద్దరికైనా శిక్ష పడితేనే నేరస్థుల గుండెల్లో భయం పుడుతుంది. అందుకోసం ఈ కేసులను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మేధావుల అభిప్రాయం.
చట్టాలు ఏం చెబుతున్నాయి..?
భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు వెళ్లిన వారిని వెనక్కి తీసుకురావడానికి నేరస్థుల అప్పగింత చట్టం కీలక పాత్ర వహిస్తుంది. నేరస్థుల అప్పగింతకు సంబంధించి మన దేశం ఇప్పటివరకు 47 దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. మరో 11 దేశాలతోనూ ఈ తరహా ఒప్పందాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ చట్టాన్ని అనుసరించి ఆ వ్యక్తిని అప్పగించాలని అతడు ఉన్న దేశానికి భారత్ విజ్ఞప్తి చేస్తుంది. నేరస్థుల విషయంలో సమన్వయం కోసం 192 దేశాల్లో ఇంటర్పోల్ వ్యవస్థ ఉంది. సీబీఐ ద్వారా ఇంటర్పోల్ కు నోటిఫై చేయగానే వారు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. తద్వారా అన్ని దేశాలకు ఆ వ్యక్తి నేరస్థుడు అని తెలుస్తుంది. దీంతో అతడిని ఏ దేశంలో అరెస్టు చేసినా భారత్కు తెలుస్తుంది. ఆ తర్వాత అతడి అప్పగింతకు ప్రతిపాదన పంపుతారు. అయితే సదరు వ్యక్తి ఇక్కడ చేసిన నేరం ఆ దేశంలోనూ నేరంగా పరిగణించాలి. ఆపై అరెస్టుకు అవసరమైన బలమైన కారణాలను చూపాలి. కానీ ఆ నేరగాళ్లు అనేక వాదనలు కోర్టు ముందు ఉంచి భారత్కు రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేయడం సహజమే. అయితే వారి ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం ‘ఫుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్-2018’ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం వారిని ఫుజిటివ్ క్రిమినల్ గా నిర్ధారణ చేసి.. నేరానికి పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన వ్యక్తులుగా చూపిస్తుంది. దీని వల్ల వారి ఆస్తులను గుర్తించి.. వేలం వేసే అధికారం మనకు కలుగుతుంది. అంటే ఓవైపు నేరస్థుల అప్పగింత చట్టం ద్వారా వాళ్లని రప్పించే ప్రయత్నాలు.. ఫుజిటివ్ యాక్ట్ ద్వారా డబ్బులు రికవరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాబోయే కాలంలో ఇలాంటి వారికి అడ్డుకట్టవేసేందుకు నేరస్థుల అప్పగింత ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
పెరిగిన ఆర్థిక నేరాల సగటు పరిమాణం..
ప్రతి బ్యాంకులో 14 నుంచి 22 శాతం వరకు ఎన్ పీ ఏ(నిరర్ధక ఆస్తులు) లు ఉన్నాయి. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఇంత మొత్తంలో నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం మనదేశంలో మాత్రమే కనిపిస్తోంది. రుణాలు అధికంగా ఇస్తుండటం వల్ల ఆర్థిక నేరాల పరిమాణం కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలా నిరర్థక ఆస్తులుగా పేరుకుపోయిన రుణాలను ఆయా బ్యాంకులు రైటాఫ్ చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం ఇప్పటివరకు అలా రైటాఫ్ చేసిన మొత్తం సుమారు రూ.24 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే ప్రజల దగ్గర నుంచి వడ్డీ రూపంలో తీసుకొని ప్రభుత్వానికి అందజేయాల్సిన సొమ్మును రైట్ ఆఫ్ రూపంలో బ్యాంకులు బడా బాబుల రుణాల రద్దుకు వినియోగిస్తున్నాయి.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు ఉన్నప్పటికీ..
సాధారణంగా నేరం జరిగిపోయాక సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు బ్యాంకులు ఫిర్యాదు చేస్తుంటాయి. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్న వ్యక్తులపై ఎప్పుడూ నిఘా ఉంచాలి. ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారు బయట దేశాలకు వెళ్లి ఎందుకు ముందస్తుగా పౌరసత్వం తీసుకుంటున్నారనే అంశాన్ని విశ్లేషించాలి. ముఖ్యంగా వారు ఏ బ్యాంకులో ఈ విధంగా రుణాలు తీసుకున్నారు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నిజానికి ప్రతి బ్యాంకు లోను విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇలాంటి నేరాలను బయటకు తీయాల్సిన బాధ్యత అక్కడ ఉండే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు ఉంటుంది. ఆ వ్యవస్థను సైతం బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ మొత్తం తీసుకున్న వారిపై ఆధునిక సాంకేతికత సాయంతో ఎప్పుడు నిఘా కొనసాగించాలి. నష్టం జరగక ముందే ఈ నేరాలను నియంత్రించే చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్