Telangana News: ఆ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రి... డ్రైవరే డాక్టరు

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రి గా మారింది. బస్సు డ్రైవరే డాక్టరయ్యారు...

Published : 27 Jun 2022 01:09 IST

హైదరాబాద్‌: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రి గా మారింది. బస్సు డ్రైవరే డాక్టరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలూకా సింగరివాడకి చెందిన గర్భిణి మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్‌ మండలం మనకాపూర్‌ వద్దకు రాగానే పురిటినొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులోని ఆదివాసీ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108కు ఫోన్‌ చేసినా సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్‌.. బస్సును నేరుగా గుడిహత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించారు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు సంతోషించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్‌, డీఎం విజయ్‌ ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవితకాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్‌ పాస్‌ అందిస్తామని తెలిపారు.

డ్రైవర్‌, కండక్టర్‌ను అభినందించిన ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ

తల్లిబిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన  బస్సు డ్రైవర్‌ ఎం. అంజన్న, కండక్టర్‌ సీహెచ్‌ గబ్బర్‌సింగ్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, సీఎండీ సజ్జనార్‌ అభినందించారు. ఆ బిడ్డకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ  ఆయుష్షు ప్రసాదించాలని కోరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని