Florida: విహారయాత్రలో విషాదం.. అమెరికాలో బాపట్ల మహిళ మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్‌ కూలి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన సుప్రజ (34) ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు...

Updated : 31 May 2022 18:46 IST

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ (34) ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మృతురాలు సుప్రజ భర్త ఆలపర్తి శ్రీనివాసరావుది బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడు గ్రామం. వీరు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. శ్రీనివాసరావు చికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వీరికి అక్షత్‌ చౌదరి (10), శ్రీఅధిరా (6) పిల్లలు ఉన్నారు. ఇటీవలే వారు ఫ్లోరిడాకు మారారు. వేసవి సెలవులు కావడంతో అక్కడే స్థానికంగా ఉంటున్న తెలుగు కుటుంబాలతో కలిసి సుప్రజ కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. విహారయాత్రలో భాగంగా బోటింగ్‌ చేస్తుండగా బోట్‌కు అనుసంధానించిన ప్యారాచూట్‌పై సుప్రజ, ఆమె కుమారుడు అక్షత్‌ విహరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ప్యారాచూట్‌ వంతెనకు తగిలింది. దీంతో సుప్రజ తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఆమె కుమారుడు అక్షత్‌ స్వల్పంగా గాయపడ్డాడు. వీరితో పాటు అక్కడే ఉన్న మరో చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు తెలస్తోంది. మృతురాలి తండ్రి తేళ్ల శ్రీనివాసరావు సంతమాగులూరు మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడిగా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని