Vijayawada: న్యాయవాదిపై కేసు.. భవానీపురం సీఐను వీఆర్‌కు పంపిన సీపీ

భవానీపురం సీఐ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 22 Mar 2023 22:07 IST

విజయవాడ: భవానీపురం సీఐ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్‌  బాలికపై లైంగికదాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదిపైనే కేసు నమోదు చేశారని ఇటీవల బెజవాడ బార్‌ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. సీఐ ఉమర్‌ను సస్పెండ్‌ చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాదులు సీపీ కాంతిరాణాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి, విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని బాధితులకు సీపీ హామీ ఇచ్చారు. ఈక్రమంలో బుధవారం సీఐ ఉమర్‌ను వీఆర్‌కు పంపారు.

ఏం జరిగిందంటే?..

భవానీపురానికి చెందిన ఓ న్యాయవాది కుమార్తె(10) స్థానికంగా ఉన్న పార్క్‌లో ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో న్యాయవాది రాత్రి 10 గంటల సమయంలో భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన్ని పోలీసులు రాత్రి 11.00 గంటలకు వరకు కూర్చోబెట్టి, ఎఫ్‌.ఐ.ఆర్‌ కట్టకుండా దిశ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈలోపు నిందితుడు రాత్రి 11.00 గంటల తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సదరు న్యాయవాదిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారించకుండానే న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని న్యాయవాది, బీబీఏ కార్యవర్గ సభ్యులకు చెప్పగా.. వారు పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌లో తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి, ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. భవానీపురం సీఐ ఉమర్‌, ఏఎస్‌ఐ గంగాధర్‌లను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానాల ప్రాంగణం నుంచి ర్యాలీగా అయిదో నెంబరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో న్యాయవాదులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాదాపు ఐదు గంటల పాటు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని