
అభ్యర్థి చనిపోయిన విషయం దాచారు.. అయన్నే గెలిపించారు!
పట్నా: బిహార్లో విస్తుగొలిపే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి మృతి చెందిన విషయాన్ని దాచి ఉంచి, అతన్నే గెలిపించారు ఆ గ్రామస్థులు. గెలుపు పత్రం అందజేసే సమయంలో తీరా అభ్యర్థి కనిపించకపోవడంతో.. ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్లోని జముయ్ జిల్లా మారుమూల గ్రామమైన దీపకర్హార్లో సోహన్ ముర్ము అనే అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిల్చున్నారు. అయితే నవంబరు 6వ తేదీనే సోహన్ మృతి చెందారు. ఇది జరిగిన రెండు వారాలకు ఎన్నికలు జరగ్గా ఆయన గెలుపొందారు.
చివరి కోరిక నెరవేర్చేందుకే..
ఎన్నికల్లో గెలుపొందడమే ముర్ము చివరి కోరిక అని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అందుకే మృతిచెందిన విషయాన్ని బయటకు చెప్పలేదని తెలపడం గమనార్హం. గ్రామస్థులు సైతం ఈ విషయంపై సమాచారం ఇవ్వలేదని ఇక్కడి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. ముర్ము చివరి కోరికను నెరవేర్చేందుకు వారంతా ఆయనకు అనుకూలంగా ఓటు వేసినట్లు కనిపిస్తోందని అధికారి తెలిపారు. ఈ క్రమంలో సంబంధిత ఎన్నికను రద్దు చేసి.. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికలకు లేఖ రాస్తామని త్రిపాఠి చెప్పారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
Advertisement