‘సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ’కు ఓకే

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. ఇటీవల అసెంబ్లీ సెక్షన్‌ ముగిసిన అనంతరం ఈ బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా రెండు బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. 

Updated : 31 Jul 2020 17:53 IST

ఆమోదం తెలిపిన గవర్నర్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. మూడు వారాల కిందట ఈ బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా రెండు బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఈ బిల్లులపై న్యాయ శాఖ అధికారులతో గవర్నర్‌ సంప్రదింపులు జరిపారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావించింది. దీంతో తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపారు. 

గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మన్‌ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో వేర్వేరు‌ పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని