CBI: వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తులో నిన్‌హైడ్రేట్‌ పరీక్ష!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

Updated : 12 May 2023 16:33 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్‌హైడ్రేట్‌ పరీక్షకు అనుమతించాలని కోరుతూ సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దీనిపై నిందితుల అభిప్రాయాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై జూన్‌ 2న సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.

హత్యాస్థలిలో లభించిన లేఖను సీబీఐ అధికారులు 2022, ఫిబ్రవరి 11న సీఎఫ్‌ఎస్‌ఎల్‌ పంపించి రెండు ప్రధాన అంశాలను తెలియజేయాలని కోరారు. లేఖను ఒత్తిడిలో రాశారా? లేదా? తేల్చాలని లేఖ రాశారు. అనంతరం వివేకా రాసిన ఇతర లేఖలను పోల్చి చూసిన తర్వాత ఆయన ఒత్తిడిలో లేఖ రాసినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలు తేల్చాయి. తాజాగా లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్‌ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ను సీబీఐ అధికారులు కోరారు.

ఈ పరీక్ష ద్వారా లేఖపై చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని వివరించింది. హత్య కేసు విచారణలో లేఖ ఇప్పుడు కీలక సాక్ష్యంగా ఉంది. ఒకవేళ పరీక్షలో లేఖ దెబ్బతిన్నట్లయితే దర్యాప్తు, ట్రయల్‌పై ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఒరిజినల్‌ లేఖ బదులు కలర్‌ జిరాక్స్‌ను రికార్డులో భద్రపరిచి దాన్ని సాక్ష్యంగా పరిగణించేందుకు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని.. నిన్‌హైడ్రేట్‌ పరీక్షకు అనుమతించాలని కోరారు. వివేకాతో బలవంతంగా లేఖ రాయించినట్లుగా దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై జూన్‌ 2న న్యాయస్థానం విచారణ జరపనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని