Kavitha: 11న వాంగ్మూలం నమోదు చేస్తామన్న సీబీఐ.. అంగీకరించిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈనెల 11న సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్టు తెలిపారు.

Updated : 06 Dec 2022 20:25 IST

హైదరాబాద్‌: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న ఉదయం 11గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈనెల 11న సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత మెయిల్‌ చేశారు.

మద్యం కేసులో ఈనెల 6న విచారణకు రావాలని సీబీఐ కవితకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత లేఖ రాశారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో నా పేరు ఎక్కడా లేదు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన నేను సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతాను. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరుతున్నాను. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తునకు సహకరిస్తాను’’ అని కవిత సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్సకు సోమవారం మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. కవిత పంపిన మెయిల్‌కు ఈమేరకు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న సీబీఐ విచారణకు సహకరిస్తానని కవిత మరోసారి రిప్లై ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని