
కుల రాజకీయాలను ఎదిరిద్దాం: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో కుల రాజకీయాలను, ఎస్సీల అణచివేతను గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదిరిద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ముందుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపడమే గాంధీజీకి మనం అందించే అసలైన నివాళి అన్నారు. మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ మహాత్ముడని కొనియాడారు. సమసమాజం గురించి గాంధీజీ తపించారన్న చంద్రబాబు ... గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.
లాల్ బహదూర్శాస్త్రి స్ఫూర్తితో రైతు హక్కులను కాపాడదామని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే స్వార్థమెరుగకుండా ప్రజాసేవలో తరించడమేనన్న లాల్బహదూర్శాస్త్రి మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలే ప్రజల భవిష్యత్తును వెలుగుమయం చేయగలవని నమ్మిన మహాశయుడని కీర్తించారు. లాల్ బహదూర్శాస్త్రి జయంతి సందర్భంగా ..జై కిసాన్ అన్న ఆ దేశభక్తుడి స్ఫూర్తితో రైతు హక్కులను కాపాడేందుకు ముందుకు సాగుదామని చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజ సమానత్వం సాధించేందుకు మహాత్ముడి మార్గంలో నడుద్దామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికవేత్తల్లో ప్రేరణ కలిగించడంతో పాటు వివక్ష, నిరంకుశత్వాలపై జరుగుతున్న ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తిగా రైతు సంక్షేమం కోసం నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు కృషిచేద్దామని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.