Chandrababu: మైక్రోసాఫ్ట్‌ వచ్చాకే హైదరాబాద్‌లో ఐటీ విప్లవం ఊపందుకుంది: చంద్రబాబు

20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌.. ఇప్పటి హైదరాబాద్‌ను పోల్చుకుంటే ఊహకందని మార్పు ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ, బయోటెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ ఎంతో ప్రగతి సాధించిందన్నారు.

Published : 17 Dec 2022 01:48 IST

హైదరాబాద్‌: ఐఎస్‌బీ హైదరాబాద్‌ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేసేందుకు ఆయన చేసిన కృషిని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారో వెల్లడించారు. ‘‘మహతీర్‌ మహమ్మద్‌ విజన్‌ 2020 గురించి చెప్పారు. ప్రమత్‌రాజ్‌ సహాయం తీసుకోమని మహతీర్‌ సూచించారు. ఆయన సలహా మేరకు విజన్‌ 2020 రూపొందించాం. విజన్‌ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారు. నేడు ఆ కల సాకారమైంది. విజన్‌ 2020తో ప్రారంభించిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయి. 11 ఏళ్ల క్రితం నాటిన చెట్టులా ఐఎస్‌బీ కూడా వృద్ధి చెందింది. 20ఏళ్ల క్రితం ఇక్కడ సెంట్రల్‌ వర్సిటీ ఒక్కటే ఉండేది.

అమెరికా వెళ్లి అనేకమంది అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈవోలను కలిశాం. మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని అప్పట్లో బతిమాలుకున్నాం. 10 నిమిషాలు అపాయింట్‌మెంట్‌ కోరి 45 నిమిషాల పాటు ఆయనకు వివరించాం. భారతీయులు గణితంలో స్వతహాగా ప్రతిభావంతులు. గణితం, ఇంగ్లీష్‌ కలిస్తేనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. ఇదే విషయం బిల్‌గేట్స్‌కు చెప్పా. ఒక్క మైక్రోసాఫ్ట్‌ తీసుకొస్తే దానివెనుక అనేక సంస్థలు వస్తాయని అప్పటి ఆలోచన. చెన్నై, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వచ్చాకే హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. మిగతా రాష్ట్రాలు ఇచ్చే రాయితీల కంటే అదనంగా ఇస్తామని చెప్పాం. ఇంతగా శ్రమించాక హైదరాబాద్‌లో ఐఎస్‌బీ పెట్టాలన్న కల సాకారమైంది. అందరు పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరిచి ఐఎస్‌బీని ఇక్కడికి తెచ్చాం. మైక్రోసాఫ్ట్‌ వచ్చాకే హైదరాబాద్‌లో ఐటీ విప్లవం ఊపందుకుంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నెలకొన్నాయి.

20 ఏళ్లలో హైదరాబాద్‌ ఎంతో ప్రగతి సాధించింది..

20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌.. ఇప్పటి హైదరాబాద్‌ను పోల్చుకుంటే ఊహకందని మార్పు ఉంది. ఐటీ, బయోటెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ ఎంతో ప్రగతి సాధించింది. బయోటెక్నాలజీలో జినోమ్‌ వ్యాలీ కొత్త విప్లవం సృష్టించింది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే పనులు సమకూరుతాయనే సూత్రం నమ్మాను. 162 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ హైదరాబాద్‌కు మణిహారం. ఓఆర్‌ఆర్‌ పక్కన వచ్చిన పచ్చదనం హైదరాబాద్‌కు గ్రీన్‌సిటీ అవార్డు తెచ్చింది. ఇప్పుడు నేను కొత్తగా ప్రతిపాదిస్తున్నది డెమొగ్రఫిక్‌ అడ్వాంటేజ్‌. యూరప్‌, జపాన్‌ లాంటి దేశాలు వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నాయి. ఇప్పుడు భారత్‌కు ఉన్న అడ్వాంటేజ్‌ యువత. వారిని అవకాశాలుగా మలచుకోవాలి. దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రజల్లో తెలుగువారే అధికశాతం. 2047 నాటికి భారతీయులు అధిక తలసరి ఆదాయం ఉన్నవారిగా మారతారు. 2047 నాటికి 1, 2, 3 స్థానాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి బలమైన శక్తిగా భారత్‌ ఎదుగుతుంది. ప్రజలు ఆర్థిక, సామాజిక సాధికారత సాధించినప్పుడే దేశం సమున్నతంగా ఎదుగుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని