
Passport Services: కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో పాస్పోర్టు సేవల్లో పరిమితులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో పాస్పోర్టు సేవలను పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న స్లాట్లలో కేవలం 50శాతం మాత్రమే బుక్ చేసుకుంటామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలో కొనసాగుతోన్న సేవా కేంద్రాల్లోనూ 50 శాతం పాస్పోర్టులను మాత్రమే జారీ చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ పనివేళల్లోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే కౌంటర్ తెరిచి ఉంటుందని పేర్కొన్నారు. పాస్పోర్టు తీసుకోకుండానే కొంత మంది ఎయిర్ టికెట్లు బుక్ చేసుకుంటారని.. ప్రస్తుత పరిస్థితుల్లో పాస్ పోర్టు జారీ ఆలస్యం అవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. జనవరి 31వ తేదీ వరకు ఈ మార్పులు వర్తిస్తాయని దాసరి బాలయ్య తెలిపారు.