బ్రిటీష్‌ వారిని వణికించిన చపాతీ ఉద్యమం..!

భారతదేశం ఎన్నో ఏళ్లు బ్రిటీష్‌ పాలనలో నలిగిపోయింది. స్వతంత్ర్య సమర యోధుల పోరాటం వల్ల ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్‌ ఇండియా

Updated : 17 Sep 2020 12:59 IST

భారతదేశం ఎన్నో ఏళ్లు బ్రిటీష్‌ పాలనలో నలిగిపోయింది. స్వాతంత్ర్య సమర యోధుల పోరాటం వల్ల ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. ఆ పోరాటంలో భాగంగా ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్‌ ఇండియా ఇలా ఎన్నో జరిగాయి. కానీ, చపాతి ఉద్యమం ఒకటి జరిగిందని, అది బ్రిటీష్‌ పాలకులకు వణుకు పుట్టించిందన్న విషయం తెలుసా?

బ్రిటీష్‌ పాలకులపై 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అదే ఏడాది ప్రారంభంలో చపాతీ ఉద్యమం ఊపందుకుంది. ఎవరు ప్రారంభించారో.. ఎందుకు ప్రారంభించారో తెలియదు గానీ, దేశంలోని ప్రతి గ్రామంలో చపాతీల పంపిణీ ఒక ఉద్యమంలా కొనసాగింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి గ్రామంలోని కాపలాదారుడికి కొన్ని చపాతీలు ఇచ్చి.. వాటిని ఊర్లో పంచమని, మరికొన్ని చపాతీలు చేసి మరికొందరికి పంపిణీ చేయమని చెప్పాడట. ఆ కాపలాదారుడు అలాగే చేయడంతో ఉత్తర భారతదేశంలో మొదలైన ఈ చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటీష్‌ అధీనంలో ఉండే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి చపాతీలు వెళ్లేవట.

1857 ఫిబ్రవరిలో తొలిసారి ఈ చపాతీల తంతు గురించి మథురలోని బ్రిటీష్‌ అధికారి థోర్న్‌హిల్‌కి తెలిసింది. తన కార్యాలయంలో ఓ పోలీసు ఆఫీసర్‌ తెచ్చిపెట్టాడని, వాటిని ఆ ఊరిలో కాపలాదారుడు ఆ పోలీస్‌కు ఇచ్చాడని తెలుసుకున్నాడు. దీనిపై విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట. రాత్రుళ్లు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచుతున్నారని, ఆ చపాతీలు రాత్రికిరాత్రే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిసింది. 

దీంతో బ్రిటీష్‌ పాలకులకు కాస్త వణుకు పుట్టింది. వీటితో ఏదో ఉద్యమం మొదలవుతోందని భావించారు. చపాతీల్లో ఏవైనా సందేశాలు ఉన్నాయేమోనని అనుమానించారు. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. కేవలం పిండితో చేసిన చపాతీలే చేతులు మారుతూ.. ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్తుండేవి. అసలు ఈ చపాతీల సంగతేంటో తేలుద్దామని బ్రిటీష్‌ అధికారులు ఎంతో ప్రయత్నించారు. కొందరు దక్షిణ భారతం నుంచి వస్తున్నాయని, మరికొందరు కోల్‌కతా నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దీని మూలాల్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత ఈ ఉద్యమం కనుమరుగైనా.. దీని ఉద్దేశమేంటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే, ఈ చపాతీల ఉద్యమం బ్రిటీష్‌ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఉద్యమం తర్వాతే సిపాయి తిరుగుబాటు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాటం జరిగాయి. అయితే వీటికి, చపాతీల ఉద్యమానికి సంబంధం ఉందో లేదో తెలియదు గానీ, ఆంగ్లేయులకు మాత్రం ముచ్చెమటలు పట్టించడం విశేషం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని