అనాథలైన చిన్నారుల వివరాలు సమర్పించండి: ఎన్‌సీపీసీఆర్‌

కరోనా మహమ్మారి రెండోదశలో విజృంభిస్తూ చాలామంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) రాష్ట్రాలను శనివారం కోరింది.

Published : 30 May 2021 01:32 IST

రాష్ట్రాలను కోరిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ 


 

దిల్లీ: కరోనా మహమ్మారి రెండోదశలో విజృంభిస్తూ చాలామంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) రాష్ట్రాలను శనివారం కోరింది. ఆ సమాచారాన్ని ‘బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌’లో పొందుపరచాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖలు రాసింది. జువెనైల్‌ జస్టిస్‌ ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, వారి హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కమిషన్‌ అభిప్రాయపడింది. అలాంటి చిన్నారులను బాలల సంక్షేమ కమిటీ ముందుకు తీసుకురావాలని తెలిపింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు  577 మంది బాలలు అనాథలైనట్లు ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అలాంటి చిన్నారుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లేఖలు రాసింది. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే చిన్నారుల కోసం ఉచిత విద్య, నెలవారీ భృతిని అందజేస్తూ అండగా నిలుస్తున్నాయి. పోషణ, సంరక్షణ అవసరమైన చిన్నారులను పర్యవేక్షించేందుకు బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌ను రూపొందించారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని