‘ప్లాస్మా.. కరోనా బాధితుల పాలిట సంజీవని’

కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా  దానం చేసిన వారికి సీపీ

Updated : 07 Aug 2020 17:20 IST

సినీ నటుడు చిరంజీవి

ప్లాస్మా దాతలకు సత్కార కార్యక్రమం

హైదరాబాద్‌: కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్‌ సత్కరించారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సత్కార కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా బారిన పడి ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం నెలకొంది. ప్లాస్మా అనేది బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోంది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే అవకాశముంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా నుంచి కోలుకుంటారు. ఒకరి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చు. కమిషనర్‌ సజ్జనార్‌ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ సమయంలో చాలా మందికి సాయం చేశారు. గతంలో నేను బ్లడ్ బ్యాంక్‌ను కూడా ఇలానే ప్రారంభించాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉత్తమ బ్లడ్ బ్యాంక్‌గా ఎంపికైంది. మా బంధువు వైరస్ సోకి అపోలోలో చికిత్స పొందుతూ ఉంటే స్వామి నాయుడు అనే వ్యక్తి ప్లాస్మా ఇవ్వడం ద్వారా నయమైంది’’అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టం అనేది ఉండదని.. ప్లాస్మా తగ్గినా 24 గంటల నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుందని చిరంజీవి తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేసిన వారికి మళ్లీ కరోనా సోకినా లేదా వారి కుటుంబసభ్యులకు కరోనా వచ్చినా వారికి ప్లాస్మా చికిత్సలో ప్రాధాన్యత ఇస్తామని సజ్జనార్‌ చెప్పారన్నారు. తన అభిమానులను ఇలాంటి మంచి పనుల వైపు మళ్లించగలిగితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉంటే వందశాతం కరోనాను ఎదుర్కొవచ్చని చిరంజీవి అన్నారు. 

ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. తలసేమియా రోగుల కోసం సైబరాబాద్‌ పోలీసులు మొదలుపెట్టిన బ్లడ్‌ డోనేషన్‌ కార్యక్రమానికి చిరంజీవి గారు ఎంతో సహాయపడ్డారని చెప్పారు. కరోనా విజేతలు ఎలాంటి అపోహలు లేకుండా, ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం కూడా రక్త దానం లాంటిదేన్నారు. ప్లాస్మా యోధులు.. ప్రాణ దాతలు కరోనా సోకిన వారిని అవమానించొద్దని విజ్ఞప్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని