వారి నినాదం ‘ఇద్దరు పిల్లలు’.. కానీ వారికేమో..

దేశంలో జనాభా పెరిగిపోతోందని, ఎలాగైనా జనాభాను అదుపులోకి తీసుకురావాలని మధ్యప్రదేశ్‌లోని భాజపా నేతలు నినదిస్తున్నారు. జనాభా పెరుగుదలకు ఓ వర్గం వారే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు....

Published : 20 Jul 2021 19:04 IST

భోపాల్‌: జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పిల్లల నినాదం మధ్యప్రదేశ్‌లోనూ ఊపందుకుంది. తమ రాష్ట్రంలోనూ ఈ నిబంధన తీసుకురావాలని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్‌లోని 80 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం గమనార్హం. ఇందులో 49 మంది అధికార భాజపాకు చెందినవారే కావడం విశేషం.

దేశంలో జనాభా పెరిగిపోతోందని, ఎలాగైనా జనాభాను అదుపులోకి తీసుకురావాలని మధ్యప్రదేశ్‌లోని భాజపా నేతలు నినదిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంత్రివర్గంలో ఉన్న 31 మంది మంత్రుల్లో 13 మంది ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్నారు. సింగ్రౌలీ భాజపా ఎమ్మెల్యే రామ్‌ లల్లూ వైశ్యాకు తొమ్మిది మంది సంతానం.

మధ్యప్రదేశ్‌లో ఉన్న 95 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 33 మందికి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వాల్‌సింగ్‌ మేదాకు తొమ్మిది మంది పిల్లలున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మహిందర్‌ సిసోడియా మాట్లాడుతూ జనాభా నియంత్రణకు దేశంలో అనేక చట్టాలున్నప్పటికీ జనాభా పెరిగిపోతూనేఉందన్నారు. జనాభా నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని