CJI: చేతికి ఎముకలేని తనానికి కేసీఆర్ ట్రేడ్మార్క్: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
హైదరాబాద్: కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తెలంగాణ హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచామని.. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని.. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. ‘‘మౌలిక వసతులు, ఖాళీల భర్తీపై దృష్టిపెట్టాం. న్యాయవ్యవస్థ మానవీయ కోణంలో పనిచేయాలి. అన్ని వర్గాలనూ సమానంగా గౌరవించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులకు అప్గ్రేడ్ కావాలి. న్యాయమూర్తులు ఎలాంటి భయం లేకుండా పనిచేయాలి. న్యాయమూర్తులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. న్యాయాధికారులు ఆరోగ్యం, కుటుంబంపై దృష్టిపెట్టాలి. న్యాయాధికారుల పే కమిషన్కు సంబంధించి త్వరలో శుభవార్త ఉంటుంది’’ అని సీజేఐ తెలిపారు.
ఇటీవల హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని.. వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోందని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తుంటారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం 4,320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని చెప్పారు. చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్ మార్క్ కేసీఆర్ అని జస్టిస్ ఎన్.వి.రమణ కొనియాడారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. న్యాయవ్యవస్థ తరఫున కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.