CM Jagan: అప్పుడు గౌతమ్‌రెడ్డి ఒత్తిడే పనిచేసింది: సంస్మరణ సభలో సీఎం జగన్‌

 దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

Updated : 28 Mar 2022 15:18 IST

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గౌతమ్‌ లేని లోటును భర్తీ చేయలేమని.. కానీ ఆయన అందరి మనస్సుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయాడని చెప్పారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన గౌతమ్‌రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో జగన్‌ మాట్లాడారు. గౌతమ్‌రెడ్డి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని.. వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. గౌతమ్‌లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని.. నమ్మడానికి ఇంకా కష్టంగానే ఉందని చెప్పారు.

నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు..

‘‘నేను లేకపోయుంటే గౌతమ్‌ బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో కాంగ్రెస్‌ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాకు అండగా నిలబడేందుకు గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యమే కారణం. రాజమోహన్‌రెడ్డి నా వైపు ఉండేందుకు గౌతమ్‌ ఒత్తిడే పనిచేసింది. 2009 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా అతడు నాకు తోడున్నాడు. గౌతమ్‌రెడ్డి నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు.. అయినా ఏ రోజూ అలా ఉండేది కాదు. నన్నే అన్నగా భావించేవాడు. మేమంతా ఉన్నాం.. నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేవాడు. ఆ తర్వాత నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మంచి నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంచి మంత్రిగా కొనసాగాడు. 

సంగం బ్యారేజ్‌కు గౌతమ్‌ పేరు పెడతాం

పరిశ్రమలు తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గౌతమ్‌ తాపత్రయ పడేవాడు. దుబాయ్‌ సదస్సుకు వెళ్లే ముందు కూడా నన్ను కలిశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను కలిసి అక్కడ విషయాలు వివరించేందుకు సమయం కూడా అడిగాడు. ఈలోపే ఇలా జరిగిపోయింది. రాజమోహన్‌రెడ్డి సూచన మేరకు కళాశాలను అగ్రికల్చర్ కాలేజ్‌గా, అవకాశముంటే యూనివర్సిటీగా మారుస్తాం. గౌతమ్‌ చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు నీరందిస్తాం. మే 15లోపు సంగం బ్యారేజ్‌ పనులు పూర్తిచేస్తాం. ఆ బ్యారేజీకి ‘మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజ్‌’గా నామకరణం చేసి దాన్ని ప్రారంభిస్తాం’’ అని జగన్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని