CM KCR: తెరాస విధానాల వల్లే అన్ని వర్గాల్లో ధీమా: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రమవుతుందని గతంలోనే చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎన్నో అంశాల్లో ముందున్నామని తెలిపారు.

Updated : 24 Mar 2023 15:36 IST

జగిత్యాల: తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రమవుతుందని గతంలోనే చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎన్నో అంశాల్లో ముందున్నామని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ ప్రయోజనాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జగిత్యాలలో నూతనంగా నిర్మించిన  కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రం ఏర్పడిన నాడు చాలా అనిశ్చిత పరిస్థితి ఉంది. క్రమంగా అన్నీ అర్థం చేసుకుని అంచనాలు వేసుకున్నాం. నేడు ఎన్నో అంశాల్లో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నాం. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలు అమలుచేస్తున్నాం. ఇవాళ దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గురుకుల విద్యాలయాల్లో తెలంగాణకు పోటీయే లేదు. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం. జిల్లాల విభజనపై కొందరు విమర్శలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. రైతుబంధు పరిమితిపైనా అభ్యంతరాలు చెప్తున్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులకు ఐదెకరాలలోపు భూమి ఉంది. 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఒక శాతం మాత్రమే. పింఛన్ల విషయంలో వృద్ధుల ధీమా చూస్తే సంతోషం కలుగుతోంది. తెరాస విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో ధీమా నెలకొంది. గ్రామాల్లోనే ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్‌ భగీరథ పైపులు 2లక్షల కి.మీ మేర ఉన్నాయి. రాష్ట్రంలో 40వేల ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. కరెంట్‌ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా మిషన్‌ భగీరథ జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. పాలకులు, అధికారుల అంకితభావం వల్లే ఇన్ని విజయాలు సాధించాం. జీఎస్‌డీపీ రూ.5లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగింది’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని