CM KCR: నిధులు మంజూరైనా... నిర్మాణ పనుల్లో జాప్యమెందుకు?: సీఎం కేసీఆర్‌

నల్గొండ పట్టణ అభివృద్ధిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నల్గొండ టౌన్‌ అభివృద్ధిపనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated : 28 Apr 2022 20:01 IST

నార్కట్‌పల్లి: నల్గొండ పట్టణ అభివృద్ధిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నల్గొండ టౌన్‌ అభివృద్ధిపనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్య తండ్రి సంతాపసభ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు ఏయే పనులు ఎంత వరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. నల్గొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన ‘నల్లగొండ కళాభారతి’ సాంస్కృతిక కేంద్రాన్ని 2వేల మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలన్నారు. పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్‌ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్‌లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫొటోల నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, ఇతర అధికారులు సీఎం కేసీఆర్‌కు పనుల పురోగతిపై వివరించారు. నల్గొండ టౌన్లో వీలైన ప్రదేశాల్లో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీలపై సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద  వృక్షాలను ట్రాన్స్‌ లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సీఎంకు వివరించారు.

సాగర్ అభివృద్ది పై ఆరా ...

నాగార్జున సాగర్‌ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్‌తో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్‌ ఇరిగేషన్ పనుల పురోగతిపై ఎమ్మెల్యే భగత్‌ను సీఎం ఆరా తీయగా, వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్యే పూర్తయిన విషయాన్ని అధికారులు సీఎంకు తెలిపారు. వీటికి సంబంధించి నిధులు మంజూరై చాలా రోజులయ్యాయని, పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో నల్గొండ మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌, నల్గొండలో క్లాక్‌ టవర్‌ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌, నల్గొండలో క్లాక్‌టవర్‌ జంక్షన్ వద్ద ఆర్‌అండ్‌బీ గెస్గ్‌హౌస్‌, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయాల నిర్మాణాలకు సీఎం నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సమీక్షా సమావేశం నుంచి రోడ్లు భవనాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి నిర్మాణాలకు సంబంధించిన జీవోలు జారీ చేయాలన్నారు. ఆరు నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ మందాడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని