CM KCR: యాదాద్రి పవర్ ప్లాంట్.. దేశ ప్రతిష్ఠను పెంచుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దేశ ప్రతిష్ఠను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
యాదాద్రి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దేశ ప్రతిష్ఠను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వ రంగంలోనే దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లారు. తొలుత ప్లాంట్ ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లిన సీఎం.. 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్ చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరగుతున్న తీరుపై ట్రాన్స్కో, జన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ప్లాంట్కు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. విద్యుత్ కేంద్రంలో కనీసం 30 రోజులకి అవసరమయ్యే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్టు విషయంలో బొగ్గు నిల్వలు సహా, ఇతర నిర్వహణలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పవర్ ప్లాంట్కు ప్రతిరోజు బొగ్గు, నీరు ఎంత అవసరమవుతుందనే విషయంపై సీఎం ఆరా తీశారు. కృష్టా జలాలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంట్కు దామరచర్లను ఎంపిక చేసినట్టు తెలిపారు.
100 ఎకరాలు సేకరించండి..
విద్యుత్ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేల మందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇక్కడే సౌరవిద్యుత్తు నిర్మాణం చేపడుతున్నందున పనిచేసే సిబ్బంది ఇంకా పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది క్వార్టర్స్, ఇతరత్రా సదుపాయాల కోసం ప్రత్యేకంగా వంద ఎకరాలు సేకరించాలన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 50 ఎకరాలు కేటాయించాలన్న సీఎం.. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలని చెప్పారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలు అందించే ప్రైవేట్ సర్వీసు ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు సుమారు 7కి.మీ మేర నాలుగు వరసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రైతుల పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలి..
విద్యుత్ కేంద్రానికి భూమి ఇచ్చిన రైతులతోపాటు గతంలో సాగర్ ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తోపాటు జిల్లా కలెక్టర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను సేకరించడానికి ఎక్కువ సమయం కేటాయించిన సీఎం.. ఎక్కడికక్కడే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు.. మిగతావి 2024 జూన్లోపు పూర్తవుతాయని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సీఎంకు వివరించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎండీ ప్రభాకర్రావును ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?