మైనర్‌కు బండి.. డేంజరండి

లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడమే నేరం. అలాంటిది లైసెన్స్‌ పొందే అర్హత లేనివాళ్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. బండి నడపడం వస్తే చాలు ఏం కాదులే అనుకొని కొందరు తల్లిదండ్రులు వాహనం ఇచ్చేస్తున్నారు....

Published : 17 Mar 2021 23:47 IST

ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు బలిగొంటున్న వైనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడమే నేరం. అలాంటిది లైసెన్స్‌ పొందే అర్హత లేనివాళ్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. బండి నడపడం వస్తే చాలు ఏం కాదులే అనుకొని కొందరు తల్లిదండ్రులు వాహనం ఇచ్చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు ప్రమాదాలబారిన పడడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డెక్కితే చాలు లైసెన్స్‌కు అర్హత లేని పిల్లల డ్రైవింగ్‌ దృశ్యాలు కళ్లెదుటే కనిపిస్తాయి. కార్యాలయాల్లో దింపేందుకు ఉద్యోగులు తమ పిల్లలకు వాహనం అప్పగించడం, బజారుకు వెళ్లి సరుకులు తెచ్చేందుకో, ఇతర పనుల కోసం బండి ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. పిల్లల నిర్లక్షపు డ్రైవింగ్‌తో ప్రమాదాల బారిన పడడమే కాకుండా, ఇతరులను సైతం ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఒకే బండిపై ముగ్గురు ప్రయాణిస్తూ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, సీసీ కెమెరాల నుంచి తప్పించుకునేందుకు గల్లీల్లో దూసుకెళుతున్నారు.

మైనర్ల డ్రైవింగ్‌ వల్ల రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలతో పాలమూరులో ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం లైసెన్స్‌ లేనందుకు జరిమానాలు విధిస్తున్నారు. వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఇవేకాకుండా కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, లేజర్‌ గన్‌, సామాజిక మాధ్యమాలు, సిగ్నల్‌ జంప్‌ల ద్వారా మైనర్‌ డ్రైవర్లను గుర్తించి ఛలాన్లు విధిస్తున్నారు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం భారీ జరిమానాలు విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని