‘కరోనా మాత’ ఆలయం ధ్వంసం

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని జుహి శుక్లాపుర్‌ ప్రజలు నిర్మించిన కరోనా మాత అలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. పోలీసులే ఆలయాన్ని........

Published : 12 Jun 2021 23:45 IST

ప్రతాప్‌గఢ్‌: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని జుహి శుక్లాపుర్‌ ప్రజలు నిర్మించిన కరోనా మాత అలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. పోలీసులే ఆలయాన్ని నేలమట్టం చేశారంటూ స్థానికులు ఆరోపించారు. కానీ స్థానికుల ఆరోపణలను పోలీసుల తోసిపుచ్చారు. ఆ ఆలయం వివాదాస్పద స్థలంలో నిర్మించినట్టు తెలిపారు. ఆ వివాదంతో సంబంధమున్న వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కరోనా మాత ఆలయాన్ని ఈ నెల 7న లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి స్థానిక దాతల సహకారంతో నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు. కరోనా మాత విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించి.. అదే గ్రామానికి చెందిన రాధే శ్యామ్‌ వర్మను పూజారిగా నియమించారని వివరించారు. ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్‌ కుమార్‌, నగేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, జైప్రకాశ్‌ శ్రీవాస్తవ ఉమ్మడి ఆస్తి. అయితే, ఆలయం నిర్మించిన తర్వాత లోకేశ్‌ కుమార్‌ నోయిడాకు వెళ్లిపోయాడు. ఆలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నగేశ్‌.. సంగీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఆలయాన్ని నిర్మించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని