నెమ్మదిగా నడిచేవారిలో కొవిడ్‌ ముప్పు ఎక్కువే!

నెమ్మదిగా నడిచే వ్యక్తుల్లో కరోనా వైరస్‌ ముప్పు ఎక్కువేనని ఇంగ్లాండ్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Updated : 18 Mar 2021 04:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెమ్మదిగా నడిచే వ్యక్తుల్లో కరోనా వైరస్‌ ముప్పు ఎక్కువేనని లండన్‌ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ బరువు కలిగి, వేగంగా నడిచే వారితో పోలిస్తే నెమ్మదిగా నడిచేవారిలో కొవిడ్‌ మరణాలు దాదాపు నాలుగు రెట్లు అధికమని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లైసెస్టర్‌ పరిశోధకులు గుర్తించారు.

అధిక బరువు కలిగి, నెమ్మదిగా నడిచే వ్యక్తుల్లో కొవిడ్‌ తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) స్థాయి అధికంగా ఉన్న దాదాపు 4 లక్షల 12వేల మంది మధ్యవయసు కలిగిన వారిపై అధ్యయనం చేపట్టారు. నెమ్మదిగా నడిచే వారిలో కొవిడ్‌ ముప్పు 2.5 రెట్లు ఎక్కువగా ఉందని, వేగంగా నడిచేవారితో పోలిస్తే ఇలాంటి వారిలో మరణాలు నాలుగు రెట్లు ఎక్కువని కనుగొన్నారు. ‘శారీరక బలహీనత, స్థూలకాయం వల్ల కొవిడ్‌ ముప్పు అధికంగా ఉంటుందని తెలుసు. దీన్ని నిరూపించే మొట్టమొదటి అధ్యయనం ఇది’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ యేట్స్‌ పేర్కొన్నారు. అయితే, ఇలా జరగడానికి శరీర బరువుకి సంబంధం లేదని స్పష్టంచేశారు. అధిక బరువుండి వేగంగా నడిచే వారిలో ఈ ముప్పు తక్కువేనని, బరువుతో సంబంధం లేకుండా నెమ్మదిగా నడిచే వారిలోనే ఈ ప్రమాదం ఎక్కువని వెల్లడించారు.

సాధారణంగా వేగంగా నడిచే వారిలో గుండె పనితీరు మెరుగుగా ఉంటుందని తేలింది. ఇలాంటి వారిలో వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి ఒత్తిడి తక్కువగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఇది పూర్తిగా నిరూపితం కాలేదని ప్రొఫెసర్‌ యేట్స్‌ అభిప్రాయపడ్డారు. అందుకే బీఎంఐతో పాటే నడక స్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని స్పష్టంచేశారు. ఆరోగ్యంతో పాటు శరీరక ధృడత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇలాంటి ముప్పుల నుంచి బయటపడవచ్చని తాజా అధ్యయనం స్పష్టంచేస్తోందని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని