Covid vaccination: రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ టీకాల స్పెషల్‌ డ్రైవ్‌

తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్‌ టీకాలు లక్ష్యంగా రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం కానుంది.  18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరికీ టీకాలు వేసే స్పెషల్‌ డ్రైవ్‌పై అన్ని

Updated : 15 Sep 2021 20:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్‌ టీకాలు లక్ష్యంగా రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం కానుంది.  18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరికీ టీకాలు వేసే స్పెషల్‌ డ్రైవ్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. హన్మకొండ కలెక్టరేట్‌ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ నుంచి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అందరికీ వ్యాక్సినేషన్‌ కోసం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

గ్రామస్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి... మహిళాగ్రూపు సంఘాలతో సమన్వయం చేసుకోవాలని డీఆర్డీఓలను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పడకలు ఏర్పాటు చేసుకోవాలని, మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లకు వెంటనే వేయాలని చెప్పారు. గ్రామస్థాయిలోనే వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించి స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన వారికి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామ‌ని మంత్రి తెలిపారు.

రోజూ 3లక్షల మందికి టీకాలు: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రతి రోజు 3లక్షల మందికి టీకాలు ఇచ్చేలా స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకూడదన్న సదుద్దేశంతోనే ఈ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం నిర్ణయించారని వివరించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడి వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు 2.80 కోట్ల మంది ఉన్నారని, అందులో ఇప్పటివరకు 1.45 కోట్ల మంది మొదటి డోస్‌ తీసుకున్నారని చెప్పారు. 55లక్షల మంది రెండో డోస్‌ తీసుకున్నారని సీఎస్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు వ్యాక్సినేషన్ లో పెద్దఎత్తున ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి రోజూ 10నిమిషాల సమయం కేటాయించి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సమీక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్ నిర్వహణ నిరంతరం కొనసాగించాలని, వ్యాక్సినేషన్ పూర్తైనట్టు స్టిక్కర్లు వేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని