Tauktae: 410 మందితో కొట్టుకుపోయిన నౌకలు!

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి

Updated : 17 May 2021 18:01 IST

సహాయక చర్యలు ముమ్మరం

ముంబయి: దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుపాను ప్రస్తుతం గుజరాత్‌ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబయిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ధాటికి బాంబే హై ప్రాంతంలో తీరానికి నిలిపి ఉన్న రెండు బార్జ్‌ల యాంకర్‌లు తొలగిపోయాయి. దీంతో అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి.  వీటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం తక్షణ సహాయకచర్యలు చేపట్టారు.

కొట్టుకుపోయిన భారీ నౌక.. గాలింపు ముమ్మరం

‘‘బాంబే హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ305 బార్జ్‌ హీరా ఆయిల్‌ ఫీల్డ్స్‌ను వదిలి నీటిపై కొట్టుకుపోతోందని సమాచారం వచ్చింది. దీంతో రెస్క్యూ సేవల కోసం ఐఎన్‌ఎస్‌ కోచి బయల్దేరింది’’ అని నేవీ అధికార ప్రతినిధి ట్విటర్‌లో వెల్లడించారు. ఈ బార్జ్‌ ఓఎన్జీసీ సంస్థకు చెందినది. అయితే తమ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, బార్జ్‌ కూడా స్థిరంగా ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

ఇక GAL కన్స్‌ట్రక్టర్‌కు చెందిన మరో బార్జ్‌ ముంబయి తీరంనుంచి 8 నాటికైల్‌ మైళ్లు కొట్టుకుపోయినట్లు నేవీకి మరో అత్యవసర సందేశం అందింది. అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సహాయక చర్యల నిమిత్తం ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌక వెళ్లింది. తుపానుకు ముందు బార్జ్‌లన్నింటికీ యాంకర్‌ వేసే ఉందని.. అయితే తౌక్టే ధాటికి యాంకర్లు ఊడిపోయి అవి కొట్టుకుపోయాయని నేవీ తెలిపింది. ఈ బార్జ్‌ల్లోని సిబ్బందిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌకాదళ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
 
మహారాష్ట్రలో ఇద్దరు మృతి..

తౌక్టే తుపాను ధాటికి మహారాష్ట్రలోని ముంబయి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ముంబయి ఎయిర్‌పోర్టులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అటు లోకల్‌ రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. తుపాను కారణంగా కొంకణ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆనంద్‌వాడీ హార్బర్‌లో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒక నావికుడు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇక రాయ్‌గఢ్‌ ప్రాంతంలో భవనం గోడ కూలి ఓ వ్యక్తి చనిపోయారు.

ఈ రోజు ఈ తుపాను మరింత బలపడటంతో ఉదయం 5.30గంటలకు అతి తీవ్ర తుపానుగా మారినట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ముంబయికి 150కి.మీల దూరంలో కేంద్రీకృతమైన తుపాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20కి.ల వేగంతో పయనిస్తోంది. సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8.30గంటల మధ్య గుజరాత్‌ తీరాన్ని తాకనున్న ఈ తుపాను.. రాత్రి  8నుంచి 12గంటల మధ్య పోరుబందర్‌, మహువా వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

ఉద్ధవ్‌కు ప్రధాని ఫోన్‌..

ఈ తుపాను తీవ్రత నేపథ్యంలో ముంబయి విమానాశ్రయాన్ని సాయంత్రం 6గంటల వరకు మూసివేశారు. తుపాను సహాయక సన్నద్ధతపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పునరావాస చర్యలపై వివరాలను అడిగితెలుసుకున్నారు.

 
 

 

కేరళలో అధిక తీవ్రత

కేరళలో తౌక్టే తీవ్రత అధికంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 9 జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాలకు అనేక డ్యాంలలో నీటి మట్టం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో ఆరంజ్‌ హెచ్చరిక జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

కర్ణాటకలో భారీ వర్షాలు

కర్ణాటకలోని ఏడు జిల్లాల పరిధిలో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఉడిపి జిల్లాలోని నాడా స్టేషన్‌ వద్ద అత్యధికంగా 385మి.మీల వర్షం కురిసింది. మరో 15చోట్ల 200 మి.మీల వర్షపాతం నమోదైంది. ఉత్తర కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దాదాపు 200 వరకు ఇళ్లు ధ్వంసం కాగా.. 491 విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. శనివారం రాత్రి నుంచే గోవాలో భారీగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌  సరఫరాకు తీవ్ర అంతరాయం.. విద్యుత్‌ పునరుద్ధరణకు అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని