దిల్లీపోలీస్‌: గుణపాఠాలే కాదు.. పాఠాలూ నేర్పిస్తారు!

పోలీసులు ఉన్నది నేరస్థులుగా మారిన వ్యక్తులకు గుణపాఠం చెప్పడానికే కాదు.. భావితరం చిన్నారులు నేరస్థులుగా మారకుండా మంచి మార్గంలో నడిపించేందుకు కూడా అని నిరూపిస్తున్నారు దిల్లీ పోలీసులు. ఇప్పటికే కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం జమియా

Published : 13 Mar 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేరస్థులకు బుద్ధి చెప్పడమే కాదు.. ఇకపై ఎవరూ నేరస్థులుగా మారకుండా విద్యా బుద్ధులూ నేర్పిస్తామంటున్నారు దిల్లీ పోలీసులు. ఇప్పటికే కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం జమియా పోలీస్‌స్టేషన్‌లో పోలీస్‌ పబ్లిక్‌ లైబ్రరీ ఏర్పాటు చేసిన పోలీసులు.. మురికివాడల్లో ఉండే చిన్నారులకు చదువు నేర్పించాలని ఇటీవల ఆర్కేపురం పోలీస్‌స్టేషన్‌లో వేల పుస్తకాలతో ఒక లైబ్రరీ ప్రారంభించారు. 

మురికివాడల్లో ఉండే చిన్నారుల్లో చదువుపై ఆసక్తి చూపేవాళ్లు చాలా తక్కువ. పైగా కరోనా నేపథ్యంలో గతేడాది కాలంగా పాఠశాలలు మూసివేయడంతో వారంతా చదువుకు దూరమయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే చెడు వ్యసనాలకు బానిసై నేర ప్రపంచంలోకి వెళ్లే ప్రమాదముందని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ అధికారి రాజేశ్‌ శర్మ భావించారు. అలాగే, బాగా చదువుకునే విద్యార్థులకు ఇంటి వద్ద చదువుకునేందుకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగేలా, ప్రతిభగల విద్యార్థులకు చదువుకునే వాతావరణం కల్పించేలా లైబ్రరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్టేషన్‌లోనే ఒక గదిని లైబ్రరీగా మార్చి, పుస్తకాలతోపాటు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పించడానికి స్మార్ట్‌ టీవీ, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా ఏర్పాటు చేశారు. 

ఈ లైబ్రరీతో ఓ స్వచ్ఛంద సంస్థ చేయి కలిపింది. దాని సాయంతో ప్రస్తుతం ఈ లైబ్రరీలో 2,300 పుస్తకాలు, 1,900 మ్యాగజైన్లు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాల విద్యార్థులకు పాఠాలు, ఉన్నత చదువుల కోసం.. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉండే ఈ లైబ్రరీలో ఒకేసారి వందమంది కూర్చునే వీలు ఉంటుంది. ఈ లైబ్రరీ ప్రారంభించిన నాటి నుంచి మంచి స్పందన వస్తోందని, మురికివాడల్లోని విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు ఈ లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారని స్టేషన్‌ అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌ శర్మ చేపట్టిన ఈ మంచి పనిని పలు సంస్థల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ అభినందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని