Hyderabad: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్‌ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతకు సంబంధించిన నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌కు చెందినవిగా అధికారులు తెలిపారు. 

Updated : 13 Nov 2022 20:38 IST

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. దక్కన్‌ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. కూల్చివేతకు సంబంధించిన నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌కు చెందినవిగా అధికారులు తెలిపారు. దక్కన్‌ కిచెన్‌ను ప్రమోద్‌ అనే భాగస్వామితో నందకుమార్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఎదురుగా అక్రమ నిర్మాణం చేసి వ్యాపారాలు వాడుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్‌ కిచెన్‌ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండటంతో కూల్చివేశామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మరో వైపు ఈ కూల్చివేతలు అక్రమంగా చేస్తున్నారని నందకుమార్‌ భార్య చిత్రలేఖ తెలిపారు. తమకు గతంలో ఒక నోటీసు ఇచ్చారని, లీజు అగ్రిమెంట్‌ రిప్లైగా ఇచ్చామని వెల్లడించారు. రాజకీయ కక్షతో చేస్తున్నారని ఆరోపించారు. దుకాణాల లోపల ఉన్న వస్తువులు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వలేదని తెలిపారు. గతంలో అదే ప్రాంతంలో తిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ నిర్మాణం లీగల్‌ అయినప్పుడు, ప్రస్తుతం తమది ఎందుకు అక్రమ నిర్మాణం అవుతుందని ప్రశ్నించారు. ఈ భూమి లీజుపై దగ్గుబాటి కుటుంబం ఫిర్యాదు చేశారని ఆమె వివరించారు. ఆధారాలు మొత్తం అధికారులకు అందిస్తామన్నారు.

కూల్చివేతలపై జీహెచ్‌ఎంసీ వివరణ..

దక్కన్ కిచెన్ వద్ద నిర్మాణాల తొలగింపుపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. దక్కన్ కిచెన్ హోటల్ ముందు భాగంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని తెలిపారు. ఈవిషయమై ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చామన్నారు. గతేడాది కూడా ముందుభాగంలో ఉన్న నిర్మాణాలను సీజ్ చేశామని చెప్పారు. చివరగా నెల కిందట కూడా నోటీసులు ఇచ్చామన్నారు. లీజ్ అగ్రిమెంట్ పంపిచారు తప్ప.. అక్రమ నిర్మాణాలపై స్పందించలేదని వెల్లడించారు. దక్కన్ కిచెన్ ముందుభాగంలో రెండు నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని తెలిపారు. పదే పదే చెప్పిన అందులో కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు. ఆదివారం కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని