Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి

ఓ మహిళను సోషల్‌మీడియా కేసులో గుంటూరు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజు కోర్టు మేజిస్ట్రేట్‌ జి.స్పందన తప్పుబట్టారు.

Published : 27 Sep 2023 19:57 IST

గుంటూరు: తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్‌మీడియా కేసులో గుంటూరు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజు కోర్టు మేజిస్ట్రేట్‌ జి.స్పందన తప్పుబట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఈకేసులో సుప్రీంకోర్టు మారదర్శకాలను పాటించలేదని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పెట్టడం ఏమిటి? 41ఎ నోటీసులు ఇవ్వాలి కదా?’’ అని ప్రశ్నించి రిమాండ్‌కు పెట్టిన ఎస్సైను పిలవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిందితురాలు శివపార్వతి రిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆమెను సొంతపూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 

గుంటూరు విజయపురి కాలనీలో నివాసం ఉండే పిడికిటి శివపార్వతి (అలియాస్‌ లక్ష్మీ గణేష్‌) గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కేసులో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు కావటంతో ఆ బాధలో ఉన్న ఆమెకు సోషల్‌మీడియాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరుకు వ్యతిరేకంగా వచ్చిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో ఫార్వర్డ్‌ చేశారు.

వైకాపా నాయకుల నుంచే ఫిర్యాదు

ముఖ్యమంత్రి ఫొటోను మార్ఫింగ్‌ చేసి పెట్టారని, తమ నాయకుడి గౌరవానికి భంగం కలిగేలా, రెచ్చగొట్టేలా ఆ వీడియోలు ఉన్నాయని ఫార్వర్డు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. గుంటూరు 42వ డివిజన్‌ ఇంఛార్జి చల్లా శేషిరెడ్డి, ఆపార్టీకే చెందిన పశ్చిమ నియోజకవర్గ సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌ రాజవరపు జగదీష్, మరో అభిమాని షేక్‌ ఉస్మాన్‌ ఈనెల 25న ఇచ్చిన ఫిర్యాదులను అనుసరించి పట్టాభిపురం పోలీసులు 341, 342. 344 మూడు ఎఫ్‌ఐఆర్‌లు వేర్వేరుగా నమోదు చేసి శివపార్వతిపై 153, 502, 504, 505(2) ఐపీసీ సెక్షన్లు పెట్టారు. బుధవారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి.. శివపార్వతి రిమాండ్‌ను తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని