Andhra News: ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు విద్యుత్‌ కోతలు: ఏపీ ఇంధన శాఖ

ఆంధ్రప్రదేశ్‌లో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. సాధారణంగా ప్రతీ వేసవిలో 204 మిలియన్ యూనిట్లకు వినియోగం చేరుతుందన్నారు. కొవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ ...

Updated : 09 Apr 2022 19:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. సాధారణంగా ప్రతీ వేసవిలో 204 మిలియన్ యూనిట్లకు వినియోగం చేరుతుందన్నారు. కొవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరిపోయిందని వివరించారు. పరిశ్రమలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణంగా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందని శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఏపీలో జరుగుతోందని.. రాష్ట్రంలోని అన్ని జెన్‌కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని వెల్లడించారు.

‘‘ప్రస్తుత సీజన్‌లో రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. లేకపోతే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని సూచించాం. ఇదీ ఇబ్బందే.. కానీ తప్పని పరిస్థితి. వ్యవసాయ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిశ్రమలకు యథావిధిగా సరఫరా జరుగుతుంది. బొగ్గు సరఫరా గురించి సీఎం, ఎంపీలు ప్రధానితో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ ఇబ్బంది ఉంది. ఆస్పత్రులకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు పరిమితంగా కోతలు విధించాల్సి రావొచ్చు. నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు లోటు ఉంది. నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించాం’’ అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని