తెలుగు రాష్ట్రాల్లో కార్తికమాసం సందడి 

కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నదీ స్నానాలు చేసేందుకు పోటెత్తారు.

Updated : 23 Nov 2020 16:48 IST


ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తికమాసం రెండో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నదీ స్నానాలు చేసేందుకు పోటెత్తారు. దీంతో నదీతీరాలు శివనామస్మరణతో మార్మోగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి నది వద్ద వేకువజాము నుంచే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచారించి కార్తిక దీపాలను నదిలో వదిలారు. కార్తిక మాసంలో నదీస్నానం ఆచరించి కార్తిక దీపాలను వెలిగిస్తే పుణ్య ఫలం లభించడంతో పాటు స్వర్గప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసం.

పంచారామాల్లో భక్తుల సందడి

గోదావరి తీరంలో కార్తిక శోభ విరాజిల్లుతోంది. కరోనా కారణంగా రాజమహేంద్రవరంలో గోదావరి స్నానాలు నిషేధించారు. నదిలో స్నానాలు చేయకుండా పుష్కరఘాట్‌లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోనసీమలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 

కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా దివిసీమలోని పెదకళ్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి, ఘంటసాల గ్రామంలోని జలదీశ్వరస్వామి ఆలయం, మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వస్వామి ఆలయం, నడకుదురు పృథ్వీశ్వరస్వామి ఆలయంలో రెండవ కార్తిక సోమవారం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడలో శివనామస్మరణ 
కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఆ ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు..  స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసి భక్తులకు శీఘ్రదర్శనం కల్పించారు. మరోవైపు భక్తులు భారీగా తరలిరావడంతో వేములవాడలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని