
రాజరాజేశ్వరీదేవిగా బెజవాడ దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. చెరకు గడను ఎడమచేతిలో ధరించి కుడి చేతితో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంతో ఉన్న రాజరాజేశ్వరీ దేవిని దర్శించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అని పిలుస్తారు. అన్ని లోకాలకు ఆమే ఆరాధ్యదేవత.
దేవతలందరి సమష్టి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. శ్రీచక్రాన్ని అదిష్టించి యోగమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తోంది. రాజరాజేశ్వరీదేవిని పూజించడం ద్వారా మనో చైతన్యం ఉద్దీపితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమున్నతమైన దైవికశక్తి రాజరాజేశ్వరీదేవి సొంతం. శాశ్వతమైన ఆనందానికి, విజయానికి అమ్మవారు ప్రతీక. ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటీవల కరోనా వ్యాధి బారినపడిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోలుకున్న అనంతరం విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవ సేవకు అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు. దుర్గాఘాట్ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. హంస వాహనంలోకి ఎనిమిది మంది వేదపండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రపు స్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఒక ఎస్ఐను మాత్రమే అనుమతించనున్నారు.