Delhi liquor scam: అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది.

Updated : 30 Nov 2022 21:38 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన అమిత్‌ అరోరాను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు విజయ్‌ నాయర్‌కు చేరాయని తెలిపింది. ఈ విషయాన్ని అమిత్‌ అరోరా ధ్రువీకరించారని ఈడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.  ‘‘దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 36 మంది 170 ఫోన్లు ధ్వంసం చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఫోన్ల విలువ రూ.138 కోట్లు. వాటిలో కవితవి 2 నంబర్లు, 10 ఫోన్లు ఉన్నాయి. కవిత వాడిన 10ఫోన్ల ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు’’ అని ఈడీ అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు ఈడీ ఎదుట అమిత్‌ అరోరా 22 సార్లు హాజరయ్యారని, ఫోన్‌ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని అమిత్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. 22 సార్లు ప్రశ్నించిన తర్వాత అమిత్‌ కస్టడీ అవసరం ఏంటని ఈ సందర్భంగా కోర్టు ఈడీని ప్రశ్నించింది. 3 సార్లు మాత్రమే వాంగ్మూలం నమోదు చేశామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగింపు కోసమే కస్టడీ కోరుతున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని