ED: ఎన్‌ఆర్‌ఐ అకాడమీలో నగదు, పత్రాలు సీజ్‌ చేశాం: సోదాలపై ఈడీ ప్రకటన

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఈనెల 2న జరిపిన తనిఖీలు, సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది.

Published : 07 Dec 2022 14:23 IST

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ  అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఈనెల 2న జరిపిన తనిఖీలు, సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో జరిపిన సోదాల్లో కొంత నగదు, కీలక పత్రాలు సీజ్‌ చేసినట్లు వెల్లడించింది. పలువురు వ్యక్తులకు సంబంధించిన కీలక పత్రాలు కూడా అందులో ఉన్నట్లు పేర్కొంది. ఏపీ పోలీసులు నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటనలో తెలిపింది.

‘‘భవనాల నిర్మాణానికి, ఇతర అవసరాలకు ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన నిధులు మళ్లించారు. కొవిడ్‌ రోగుల నుంచి వసూలు చేసిన మొత్తానికి, సంస్థ చూపిస్తున్న లెక్కలకు పొంతన లేనట్లు గుర్తించాం. వైద్య విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తేలింది. ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు.. అకౌంట్స్ బుక్స్‌లో పేర్కొన్న గణాంకాల కంటే ఎక్కువగా వసూలు చేసినట్లు గుర్తించాం. ఎన్‌ఆర్‌ఐఏఎస్‌ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో మరో కంపెనీని రూపొందించి దాని ద్వారా ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెల్లించాల్సిన నిధులను మళ్లించారు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్న స్థిరాస్తులకు చెందిన 53 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం. వాటిని స్తంభింపజేశాం. నిధుల మళ్లింపుతో సంబంధం ఉన్న అనేక ఇతర నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని ప్రకటనలో ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని