వారం రోజుల్లోగా ఎంసెట్ సిలబస్‌పై స్పష్టత!

ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన కనిపించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలో మిగతా తరగతుల ప్రారంభం, ఎంసెట్‌ సిలబస్‌పై...

Published : 02 Feb 2021 17:58 IST

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన కనిపించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలో మిగతా తరగతుల ప్రారంభం, ఎంసెట్‌ సిలబస్‌పై వారంరోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలన్న మంత్రి.. ఫీజుల వసూళ్లు, వేతనాల చెల్లింపులపై ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని ప్రత్యక్ష బోధన కోసం ఒత్తిడి చేయవద్దంటున్న మంత్రి సబితాతో ముఖాముఖి.

ప్రత్యక్ష బోధన ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు కొన్ని పాఠశాలలను సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి స్పందన కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 14 వేలకు పైగా పాఠశాలల్లో 11 లక్షలకు పైగా విద్యార్థులు రావాల్సి ఉంది. ఇప్పుడు సగానికి పైగా వచ్చారు. మిగతా విద్యార్థులు కూడా అనుమతి పత్రాలు తీసుకొని త్వరలోనే వస్తారనుకుంటున్నాం. స్వస్థలాలకు వెళ్లినవారు కూడా వస్తున్నారు. పాఠశాలలకు విద్యాశాఖ నుంచి పలు ఆదేశాలు జారీ చేశాం. మాస్కులు, శానిటైజేషన్‌ తప్పనిసరి చేశాం. శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని సూచించాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లను ప్రారంభించాం.

కొన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేసేందుకు స్థానికులనుంచి స్పందన లేదని, దానికి సంబంధించి సిబ్బంది లేరని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వాటిపై మీ స్పందన?
అలాంటి పరిస్థితేం లేదు. సోమవారం అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. పాఠశాలను గ్రామపంచాయతీ బాధ్యతగా భావించాలి.

మిగతా తరగతులు ఎప్పటినుంచి ప్రారంభించే అవకాశం ఉంది?
ప్రస్తుతం ప్రారంభించిన తరగతులను కొద్దిరోజులు పరిశీలించాలి. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఐసోలేషన్‌ రూంలో ఉంచనున్నాం. వైద్య సేవలందించనున్నాం. విద్యాశాఖ తీసుకుంటున్న అన్ని రకాల చర్యలతో పిల్లలలోపాటు తల్లిదండ్రుల్లోనూ ధైర్యం రావాలి. అనంతరం మిగతా తరగతుల ప్రాంరంభంపై ఆలోచిస్తాం.

విద్యాశాఖ స్పష్టమైన జీవోలు ఇచ్చినప్పటికీ కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ బోధన నిర్వహించబోమని పేర్కొంటూ ఫీజుల గురించి వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మీ స్పందన?
ప్రైవేటు పాఠశాలలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సిందే. తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెంచి విద్యార్థులను స్కూళ్లకు రప్పించుకోవద్దని, ట్యూషన్‌ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. హాజరు శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవద్దని సూచించాం. ఈ తరహా సమస్యలున్న స్కూళ్లలో పరిస్థితిని చక్కదిద్దేలా డీఈఓకు సూచిస్తున్నాం.

ఎంసెట్‌ సహా పోటీ పరీక్షల సిలబస్‌పై ఎప్పుడు స్పష్టతనివ్వనున్నారు?
వారం రోజుల్లోగా ఈ విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటాం.

ఇవీ చదవండి...

నా భర్త చదివిన పాఠశాల ఫొటో తీయండి

అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలి: కేటీఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని