Andhra News: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి కన్నుమూత

కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి(68) కన్నుమూశారు. పి.గన్నవరంలోని ఇంటి వద్ద ఆయనకు ఈ తెల్లవారుజామున

Updated : 07 Jul 2022 10:13 IST

పి.గన్నవరం : కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి(68) కన్నుమూశారు. పి.గన్నవరంలోని ఇంటి వద్ద ఆయనకు ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆయన తుది శ్వాస విడిచారు. 1996 వరకు ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌లో చిరుద్యోగిగా విధులు నిర్వహించారు. ఉద్యోగంలో ఉండగానే 1996లో జరిగిన ఉప ఎన్నికలో నగరం అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

2004లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా-భాజపా పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని భాజపాకు కేటాయించారు. ఆ సమయంలో నారాయణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు తెదేపా టికెట్‌ రాలేదు. దీంతో భాజపాలో చేరి కొంతకాలం ఆ పార్టీలో కొనసాగి భాజపాను వీడారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మంచి మనిషి, సౌమ్యుడిగా పులపర్తికి పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని