కరోనా లేకుంటే.. వీటి సందడే వేరు!

కరోనా మహమ్మారి వల్ల సాధారణ జీవితాలు తలకిందులయ్యాయి. ఎన్నో ఆశలు.. ప్రణాళికలతో 2020ని మొదలుపెట్టిన ప్రజలకు కరోనా గట్టి షాకే ఇచ్చింది. మహమ్మారి దెబ్బకు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరగాల్సిన అంతర్జాతీయ కార్యక్రమాల్లో కొన్ని వాయిదా

Updated : 03 Oct 2020 00:46 IST

 

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్‌ మెగాటోర్నీ ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో దిగ్గజ జట్లు చెన్నై, ముంబయి తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనిసేన బోణి కొట్టేసింది. అయితే, ఈ టోర్నీ ప్రారంభం అంత సులభంగా ఏం జరగలేదు. కరోనా వల్ల క్రీడలు సహా అనేక రంగాలకు చెందిన మెగా ఈవెంట్ల ప్రణాళికలు తలకిందులయ్యాయి. బీసీసీఐ కృషి.. అదృష్టం బాగుండి ఐపీఎల్‌ మాత్రం ప్రారంభమైంది. కానీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరగాల్సిన అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో కొన్ని కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. మరికొన్ని రద్దయ్యాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలేంటో చూద్దాం..


టోక్యో ఒలింపిక్స్‌-2020

జులైలో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు జపాన్‌ సర్వంసిద్ధం చేసింది. టోక్యోలో ఈ ఒలింపిక్స్‌ క్రీడల సందర్భంగా ఎన్నో సరికొత్త ఆవిష్కరణలను పరిచయం చేయాలని భావించింది. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఒలింపిక్స్‌ నిర్వహణ వాయిదా పడింది. వచ్చే ఏడాది జులైలో టోక్యోలోనే ఈ విశ్వక్రీడలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.


టీ20 వరల్డ్‌ కప్‌

క్రీడల్లో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. మెగా టోర్నమెంట్లు వస్తే అభిమానులకు పండగే. అలాంటి పండగల్లో ఒకటి టీ20 వరల్డ్‌ కప్‌. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అదొక్కటే కాదు.. ముందుగానే ప్రకటించిన చాలా క్రికెట్‌ టోర్నీల షెడ్యూల్లోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.


2020 వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌

టెన్నిస్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌ను కూడా కరోనా కారణంగా రద్దు చేశారు. జూన్‌ 29.. జులై 12 మధ్య ఈ టోర్నీ జరగాల్సింది. కానీ, కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్వాహకులు రద్దు చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఈ టోర్నీ రద్దు కాగా.. ఆ తర్వాత మళ్లీ రద్దు కావడం ఇప్పుడే.


కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వివిధ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ఈ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తుంటారు. పురస్కారాలతో గౌరవిస్తుంటారు. అంతర్జాతీయ నటీనటులు ఈ వేడుకల్లో ఆకర్షణీయంగా నిలుస్తుంటారు. అయితే, ఈ వేడుకలను కరోనా కారణంగా వాయిదా వేయాలని భావించిన కేన్స్‌ నిర్వాహకులు ఆ తర్వాత రద్దు చేశారు. అయితే, ఈ వేడుకలు సెలబ్రిటీల మధ్య కాకుండా మరో మార్గంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 


మిస్‌ వరల్డ్‌-2020

అందాల పోటీలో భాగమైన మిస్‌వరల్డ్‌ కూడా కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కరోనాకు ముందు అన్ని దేశాల నుంచి అందెగత్తెలు ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ మహమ్మారి కారణంగా ఈ పోటీలను వచ్చే ఏడాది నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. 70వ ప్రపంచ సుందరి పోటీలు 2021లో జరుగుతాయని ప్రకటించారు. వేదిక, తేదీలను మాత్రం వెల్లడించలేదు. 


జెనీవా మోటార్‌ షో

మోటారు వాహనాల ప్రేమికులకు ఎంతో నచ్చే కార్యక్రమాల్లో జెనీవా అంతర్జాతీయ మోటార్‌ షో ఒకటి. ఏటా జెనీవాలో ఈ మోటార్‌ షో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మార్చి 5 నుంచి 15 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, కరోనా కారణంగా రద్దయింది. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన షోను కూడా రద్దు చేశారు.


ఈ3-2020

ఎలక్ట్రానిక్ పరికరాల ప్రియులకు ఎలక్ట్రానిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌పో(ఈ3) స్వర్గమని చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తి దృష్ట్యా జూన్‌లో లాస్‌ఏంజెల్స్‌లో జరగాల్సిన షోను రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో వేడుకలను నిర్వహించే ఉద్దేశం లేదని నిర్వహకులు స్పష్టం చేశారు. 


కొచెల్లా మ్యూజిక్‌ ఫెస్టివల్‌

ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కొచెల్లాను కూడా ఈ ఏడాది నిర్వహించడం లేదు. కరోనా కారణంగా తొలుత అక్టోబర్‌కు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పట్లో కరోనా తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆ తర్వాత ఫెస్టివల్‌ను రద్దు చేశారు. ఏటా కాలిఫోర్నియాలోని కొలరాడో ఏడారిలోని కొచెల్లా వ్యాలీలో ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు.


ది మెట్‌ గాలా

న్యూయార్క్‌ సిటీలోని ది మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌... ఏటా మెట్‌ గాలా వేడుకలను నిర్వహిస్తుంటుంది. కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి సహాయం చేయడం కోసం విరాళాలు సేకరిస్తుంటుంది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు, ఇతరులు వివిధ కాస్ట్యూమ్స్‌లో కనిపించి ఆకట్టుకుంటారు. కొవిడ్‌ కారణంగా ఈ వేడుక రద్దయింది. ఇవేకాదు.. గే ప్రైడ్‌ పారడైజ్‌, స్పెయిన్‌ టొమాటో ఫెస్టివల్‌ తదితర కార్యక్రమాలు కరోనా వల్ల ఈ ఏడాది నిర్వహణకు నోచుకోలేదు.


ఎండబ్ల్యూసీ 2020

జీఎస్‌ఎంఏ అనే సంస్థ ఏటా ప్రపంచంలోనే భారీ మొబైల్‌ ఎగ్జిబిషన్‌ ‘మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌’ను నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24-27 తేదీల్లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కానీ, కరోనా కారణంగా స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో ఫిబ్రవరి 13న ఎండబ్ల్యూసీ-2020ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇవే కాకుండా గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ ఏటా నిర్వహించే ఈవెంట్స్‌తోపాటు టెక్నాలజీ సంస్థలు అంతర్గతంగా నిర్వహించ తలపెట్టిన అనేక సదస్సులు, సమావేశాలు చాలా వరకు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడగా.. ఇంకొన్ని వర్చువల్‌గా నిర్వహించాలని భావిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని