Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు

తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇకపై ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ- సెర్ప్ ఒప్పందం చేసుకొంది.

Published : 26 Jun 2022 01:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇకపై ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ- సెర్ప్ ఒప్పందం చేసుకొంది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రాష్ట్రంలో సెర్ప్ ఆధ్వర్యంలోని ఎస్‌హెచ్‌జీలు తయారు చేసే వివిధ ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎఫ్‌పీఓలు సేకరించే ధాన్యం సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయానికి అవకాశం కలుగుతుంది. తద్వారా ఇటు స్వయం సహాయక సంఘాలు, ఎఫ్‌పీఓలు.. అటు ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెటింగ్ పెరగడంతో పాటు వ్యాపార వృద్ధి జరిగి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాలకు ఇదో మంచి వేదిక అని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దీనివల్ల దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన వస్తువులు లభిస్తాయని తెలిపారు. మన దగ్గర ‌పండించే పంటలు, తయారు చేసే వస్తువులను అమ్మాలని, గ్రామాల్లో పండే అన్ని పంటలను కొనాలని ఎఫ్‌పీఓలకు సూచించారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ తెలిపారు. తెలంగాణ రైతులు‌ పండించిన పంటలు భారతదేశ ప్రజలకు అందిచబోతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని