Telangana news: తెలంగాణలో తొలి ఫారెస్ట్‌ యూనివర్సిటీ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్‌

తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని.......

Updated : 12 Sep 2022 20:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని.. దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022కు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ కోసం అర్హులైన అటవీ వృత్తి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 

పారిశ్రామిక, గృహ అవసరాల నుంచి వచ్చే డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు తోట పంటల ద్వారా ఉత్పత్తి చేసేలా తగిన పద్ధతుల అభివృద్ధి, పరిశోధనకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. సంప్రదాయక అటవీ వ్యవసాయంతో పాటు సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా వివిధ వ్యవసాయ, జీవావరణ పరిస్థితులకు అనుకూలమైన అటవీ వ్యవసాయ నమూనాలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, నర్సరీలు, హరితనిధి కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టింది. హరితహారాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఫలితాలు పొందేలా కార్యాచరణ అమలు చేసేందుకు అవసరమైన అటవీ వృత్తి నిపుణుల లభ్యత ఉంటుందని తెలిపింది. రాష్ట్ర అవసరాలు, జాతీయ విధానాలకు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్రాల్లో నూతన కోర్సులతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసీని ఛాన్స్‌లర్‌ నియమిస్తారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ద్వారా జరగనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై తొలుత మంగళవారం అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని