ఆ తప్పులు మళ్లీ పునరావృతం కావొద్దు:సీఎస్‌

పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...

Updated : 06 Jan 2020 20:06 IST

హైదరాబాద్‌: పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డు, సీజీజీ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదని.. త్రిసభ్య కమిటీ సిఫార్సులను ఎస్‌ఎస్‌ఎసీ, ఇంటర్ బోర్డులు పూర్తిగా అమలు చేయాలని అన్నారు. అవసరమైతే అదనపు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దే ప్రతి ఒక్కరికీ సమగ్ర శిక్షణ ఇచ్చి సాధారణంగా దొర్లే పొరపాట్లపై అవగాహన కల్పించాలని సోమేశ్ కుమార్ దిశానిర్దేశం చేశారు.

విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదని.. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్‌ పరిష్కార విధానం ఉండాలని, సందేహాలు ఉన్న విద్యార్థులు వెబ్‌సైట్‌ను సంప్రదించే వెసులుబాటు ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. ప్రవేశాల మొదలు ఫలితాల వెల్లడి వరకు కేలెండర్‌ రూపొందించాలని ఆయన ఆదేశించారు. లోపాలకు ఆస్కారం లేకుండా ఐటీ మాడ్యూళ్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను సీఎస్‌కు అధికారులు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని