అమరావతిలో పోలీసుల దిద్దుబాటు చర్యలు

రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించడం, 144 సెక్షన్‌ విధించడాన్ని ఆక్షేపించిన నేపథ్యంలో పోలీసులు

Updated : 16 Jan 2020 02:10 IST

అమరావతి: రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించడం, 144 సెక్షన్‌ విధించడాన్ని ఆక్షేపించిన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఈ నెల 12, 13 తేదీల్లో ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనాలు, ఫొటోలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తనకు తానుగా (సుమోటో) విచారణకు స్వీకరించి ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)గా మలిచి, పలు వ్యాజ్యాలతో కలిపి సోమవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల్ని పరిరక్షించే దిశగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన పోలీసు అధికారులపై విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొందరు పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమను 144 సెక్షన్‌ పేరుతో ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి ఆంక్షలు విధించడంలేదని కాగితాలపై రాసుకొచ్చి.. సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి  తెచ్చారు. పోలీసుల సూచనను రైతులు తోసిపుచ్చారు. ‘మీరు రాసుకొచ్చిన నివేదికలపై సంతకాలు పెట్టం. 144 సెక్షన్‌, పోలీసు 30 యాక్టు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించండి. అప్పటి వరకు ఎలాంటి సంతకాలు చేయం’’ అని రాజధాని గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. హైకోర్టు ఆదేశాలతోనే తాము విచారణకు వచ్చామని, మీ అభిప్రాయాన్ని కాగితంపై రాసి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయినా.. రైతులు స్పందించకపోవడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.

ఇవీ చదవండి...

అమరావతిలో ఏం జరుగుతోంది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని