రాజధానిపై తొలిసారిగా స్పందించిన కేంద్రం

రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్ర పరిధిలో

Updated : 04 Feb 2020 17:34 IST

దిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దాన్ని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్‌ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది’’ అని నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు.

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా అమరావతిలో రైతులు, మహిళలు ఉద్ధృతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం భూములిచ్చిన తమకు అన్యాయం చేయడమేంటని మండిపడుతున్నారు. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లింది. శాసనసభలోనూ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందేలా చేసింది. మరోవైపు శాసన మండలిలో మాత్రం ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపుతూ ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ అమరావతి రైతుల ఆందోళనను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారముంటుందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వకంగా జయదేవ్‌కు సమాధానమిచ్చారు.  

ఇవీ చదవండి..

ఆందోళనలో అమరావతి రైతులు: జయదేవ్‌

రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తాం: అవంతి

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని