అగ్రికల్చర్ కౌన్సిల్కు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్
స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని
అమరావతి: స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లతో పాటు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. ‘జగనన్న విద్యాకానుక పథకం’ ద్వారా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల సంచులతో పాటు మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, పుస్తకాలను ఇవ్వాలనే ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ దిల్లీ బయల్దేరారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే...
మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని .. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ‘‘ పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం, డబ్బుతో అభ్యర్థి పట్టుబడితే అనర్హత వేటుతో పాటు మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించాం. పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ఐదు రోజుల ప్రచారం సమయం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల నుంచి 15 రోజులకు తగ్గించాం. సర్పంచ్ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటుకు ఆమోదముద్ర’’ వేసినట్లు చెప్పారు.
సర్పంచ్లకు మరిన్ని అధికారాలు..
‘‘ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో సర్పంచ్ లు పంచాయతీ తీర్మానం లేకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా అధికారాలు కల్పించాం. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్కే అప్పగించాం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు గిరిజనులు మాత్రమే అర్హులు. కొబ్బరి, పండ్లు, పూలతోటలు వేసి నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారాన్ని నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా పెంచాం. డిస్కమ్లు, జెన్కోలపై రూ.32వేల కోట్ల అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు సరిగా చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సౌరవిద్యుత్ను బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సౌర విద్యుత్ విషయంలో కేంద్రం కూడా అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది’’ అని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.