ప్రగతిపథంలో తెలంగాణ: తమిళిసై

తెలంగాణ శాసనసభ, శాసనమండలి వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ‘‘ తెలంగాణ ఏర్పాటైన కొత్తలో రైతు ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. విద్యుత్‌, నీరు, ఎరువుల

Updated : 06 Mar 2020 12:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. తమిళిసై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ తెలంగాణ ఏర్పాటైన కొత్తలో రైతు ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. విద్యుత్‌, నీరు, ఎరువుల పరంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోంది. తక్కువ కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది. పక్కా ప్రణాళికతో కేసీఆర్‌ సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపారు’’ అని గవర్నర్‌ వివరించారు.

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* పేదల జీవన భద్రత కోసం ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు అందనున్నాయి. 
* వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పింఛన్లతో పేదలంతా ఎవరిమీద ఆధారపడకుండా సంతోషంగా బతుకుతున్నారు.
* షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే.
*ఉమ్మడి ఏపీలో విద్యుత్‌ గరిష్ఠ డిమాండ్‌ 13,162 మెగావాట్లు. ప్రస్తుతం తెలంగాణలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 13,168 మెగావాట్లు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్‌ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నాం.
* రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం.
* రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై  పీడీ యాక్టుతో చర్యలు.
* 24 గంటల విద్యుత్‌ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.
* యువత ఉపాధి కోసం నడుపుకొనే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.
* ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోంది.
* దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు.
* డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వం రూ.5లక్షల ప్రమాద బీమా కల్పించింది.
*  వివిధ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తోంది. ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసింది.
* ఇమామ్‌, మౌజమ్‌లకు ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది.
* ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. 
తెలంగాణ ప్రగతిని చూసి యావత్‌ దేశం అబ్బురపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని