
ఏపీలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి బ్రేక్
అమరావతి: ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 25 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలవ్వగా.. హైకోర్టు మార్గదర్శకాలను సైతం పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు.