మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎవరైనా

Published : 15 Mar 2020 01:36 IST

ఆ తర్వాత అనుమతించబోం
విద్యాసంస్థలూ మూసివేత
మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు తెరిచే ఉంటాయ్‌
ఈ అర్ధరాత్రి నుంచే అమలు
కరోనాపై ఖర్చుకు రూ.500 కోట్లు కేటాయింపు
కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ తెరిచే ఉంచుతామని తెలిపారు. పెళ్లిళ్లు ఇది వరకే నిర్ణయమై ఉన్న నేపథ్యంలో 31 వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని, ఆ తర్వాత అనుమతించబోమని స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

బయటి నుంచి వచ్చిన వాళ్లతోనే..

‘‘మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు. ఒకరు కరోనా వైరస్‌ వచ్చి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 83 మందికే వచ్చింది. అందులో భారతీయులు 66 మంది ఉన్నారు. 17 మంది విదేశీయులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే చనిపోయారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. జన సమ్మర్థ ప్రదేశాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చైనా చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రాథమికంగా రూ.500 కోట్లు వెచ్చించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా వినియోగించేందుకు వీలుగా సీఎస్‌కు ఆ అధికారాలు ఇచ్చాం. ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది. విదేశాల నుంచి వస్తున్న వారితోనే ఈ వైరస్‌ వస్తోంది. ముఖ్యంగా వీరంతా ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్నారు. అందువల్ల శంషాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు బయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 1020 ఐసోలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉంచాం. మరో 321 ఐసీయూ బెడ్స్‌ ఉంచాం. ఇంకో 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. రాష్ట్రంలో క్వారంటైన్‌ ఉంచడానికి నాలుగు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం.

పెళ్లిళ్లకు 200 మంది మాత్రమే..

ఈ రాత్రి నుంచి ఈ నెల 31 వరకు జనసమ్మర్థ ప్రాంతాలను నియంత్రించాలని నిర్ణయించాం. అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు ఈ రాత్రి నుంచే మూసి వేయాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగిస్తాం. ప్రభుత్వ సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టళ్లలో, రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఉన్నవారు పరీక్షలు అయ్యేంత వరకు అక్కడే ఉండొచ్చు. అక్కడ శానిటైజర్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. పెళ్లి మండపాలు కూడా మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమై ఉంటాయ్‌ కాబట్టి వాటిపై నిషేధం నిలిపివేశాం. అయితే, 200 మంది మించకుండా వివాహం చేసుకోవాలి. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. మార్చి 31 తర్వాత మ్యారేజ్‌ హాల్స్‌కు కూడా అవకాశం ఇవ్వబోం.

బహిరంగ సభలు, వర్క్‌షాపులు, ర్యాలీలు వంటివి అనుమతించబోం. జిమ్ములు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, మ్యూజియం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్లు రద్దు చేస్తున్నాం. సినిమా హాళ్లు, పబ్బలు, క్లబ్బులు, బార్లు మూసివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, మెట్రో యథావిధిగా నడుస్తాయి. ప్రజలకు నిత్యావసరాల దృష్ట్యా సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ యథావిధిగా పనిచేస్తాయి. ప్రజలు కూడా వీలైనంత వరకు జనసమ్మర్థ ప్రదేశాలకు దూరంగా ఉండాలి’’ అని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని