
స్థానిక ఎన్నికల వాయిదాపై ఎస్ఈసీ వివరణ
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని.. దీనిపై జాతీయస్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే స్థానిక ఎన్నికలను వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం సీఎం జగన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎస్ఈసీ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు ప్రకటన వచ్చిన తక్షణమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
‘‘ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కూడా ఎన్నికల నియమావళి పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశాం.. రద్దు చేయలేదు. ఎన్నికల్లో హింసపై అనేక పార్టీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టులో వ్యాజ్యం ఉంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషనర్కు ఉంటాయి. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరం. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయి’’ అని రమేశ్కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రేపు గవర్నర్తో భేటీ
స్థానిక ఎన్నికల వాయిదా, సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గవర్నర్తో ఆయన భేటీ అయ్యే అవకాశముంది. ఏయే కారణాలతో ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నామనే దానిపై గవర్నర్తో ఎస్ఈసీ చర్చించనున్నారు.