కరోనా ఎఫెక్ట్‌: కళ తప్పిన సందర్శక ప్రాంతాలు

పర్యాటకం.. మనసుకు ఉల్లాసాన్ని.. శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్‌ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి

Updated : 21 Mar 2020 14:21 IST

పర్యాటకం.. మనసుకు ఉల్లాసాన్ని.. శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్‌ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు.. వైరస్‌ భయంతో పర్యటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్‌ రాకముందు.. వచ్చిన తర్వాత సందర్శక ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే...

చైనా వాల్‌.. ఇప్పుడు నిల్‌

చైనా గోడ.. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. దీనిని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. రెండు నెలల క్రితం నూతన సంవత్సర వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. కానీ ఆ దేశంలో కరోనా వైరస్‌ పుట్టుకొచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చైనా గోడను మూసివేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. 


ది టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌.. ఇప్పుడు వెలవెలబోయెన్‌

చైనా రాజధాని బీజింగ్‌లో ‘ది టెంపుల్‌ ఆఫ్ హెవెన్‌’ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. చైనా సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటీవల ఆ దేశంలో విజృంభించిన కరోనా వైరస్‌ కారణంగా 3వేల మందికిపైగా చైనీయులు మృతి చెందారు. 80వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. నియంత్రణ చర్యలో భాగంగా ఆ దేశంలో పర్యాటకం మూతపడింది. సందర్శకుల రాక నిలిచిపోవడంతో ది టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ వెలవెలబోతోంది. 


ఇటలీ.. సందర్శక ప్రాంతాలు ఖాళీ

అత్యధికంగా పర్యటకులు వెళ్లే ప్రాంతం ఇటలీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విషయంలోనూ అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశం కూడా అదే. కరోనా వ్యాప్తికి ముందు ఇటలీలోని ట్రెవి ఫౌంటెన్‌ వద్ద రోజుకు వేల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. ఇప్పుడు కరోనా వల్ల సందర్శకుల తాకిడి బాగా తగ్గింది. కొంతమంది మాస్కులు.. ముందస్తు జాగ్రత్తలు వహిస్తూ ఫౌంటెన్‌ను సందర్శిస్తున్నారు.


టైమ్స్‌ స్క్వేర్‌.. జీరో పీపుల్‌

ప్రపంచంలో అత్యధికంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ఒకటి. అక్కడ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్స్‌, ఆఫీస్‌లు ఎక్కువగా ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కాలు పెట్టే సందు లేకుండా ప్రజలు నడుస్తూ కనిపిస్తారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకి ఆ ప్రాంతానికి మనుషులు రావడం మానేశారు. దీంతో రోడ్లన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో నిండిపోయే గ్రాండ్‌ సెంట్రల్‌ టెర్మినల్‌, సబ్‌వేలు కూడా కరోనా ప్రభావంతో కళ తప్పాయి. 


డిస్నీపార్క్స్‌.. చడిచప్పుడు లేదు

పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీపార్కులు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా నార్త్‌ అమెరికాలో ఉన్న డిస్నీపార్కులు, హోటల్స్‌, స్టోర్స్‌ను మూసివేస్తున్నట్లు డిస్నీ యాజమాన్యం తెలిపింది. దీంతో రోజు పిల్లలతో సందడిగా ఉండే పార్కులు ఇప్పుడు మూగబోయాయి. 


సందర్శకులు లేని తాజ్‌మహల్‌.. భక్తులు లేని తిరుమల

భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పలు సందర్శక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ కూడా సందర్శకులు లేక బోసిపోతోంది. అలాగే నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా మూసివేశారు. శ్రీవారం దర్శనం నిలిపివేయడంతో భక్తులు లేక తిరుమల వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. 

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని