
‘ఎప్పుడైనా ఎన్నికలనిర్వహణకు సిద్ధంగా ఉండాలి’
ఏపీ నూతన ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్
విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అంతా సన్నద్ధంగా ఉండాలని నూతనంగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) జస్టిస్ వి. కనగరాజ్ సూచించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలని సిబ్బందికి ఆయన సూచించారు. రాష్ట్రం, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందని.. ఈ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా దానికి అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. సమయానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలన్నారు.